వెంటాడి ప్రాణం తీశారు: ప్రధాన నిందితుడికి ఓ ఎమ్మెల్యే అండ, గంటా సీరియస్
విశాఖపట్నం: నూకాంబికా అమ్మవారి దర్శనానికి భర్త అప్పలరాజుతో వెళ్లిన లావణ్య అనే మహిళను వేధించడమే కాకుండా కారుతో వెంటాడి ఆమె ప్రాణం తీసిన హంతకుడు దాడి హేమకుమార్కు జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా కారులో ఉన్న హేమకుమార్, అతని మిత్రులు నలుగురి గురించి బయటకు రాకుండా మేనేజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
గత ఆదివారం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంపై ఆదివారం వెళ్లిన దంపతులు వడ్లపూడికి చెందిన మాటూరి అప్పలరాజు, లావణ్యలను హేమకుమార్ అతడి మిత్రులు వేధించడమేగాక ఆపై కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా లావణ్య మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా, ఈ ఘటనలో లావణ్య ఆడపడుచు దివ్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన జరిగినరోజే పారిపోయిన నిందితుడు హేమసుందర్ జిల్లాలో శివారులోని ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి ఇంట్లో తలదాచుకున్నట్టు విశ్వనీయంగా తెలిసింది. ఇదిలావుండగా ఈ హత్య కేసు మెడకు చుట్టుకోకముందే బయటపడాలని హేమకుమార్, అతని మిత్రులు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా లావణ్య కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామంటూ వడ్లపూడిలోని ఆమె కుటుంబ సభ్యులకు వర్తమానం పంపినట్లు తెలిసింది. దీనిపై ఆ నియోజకవర్గానికి సారథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి ఇంట్లోనే బుధవారం రాత్రి 10 గంటల వరకు చర్చలు జరిగినట్టు సమాచారం.
కామంతో కళ్లుమూసుకుని ఓ మహిళ ప్రాణాలను తీసిని నిందితుడికి ప్రజాప్రతినిధులు అండగా నిలవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.
హేమసుందర్ను అరెస్ట్కు మంత్రి గంటా ఆదేశం
లావణ్య హత్య చేసిన ఘటనపై జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. హేసుందర్, అతడి మిత్ర బృందాన్ని వెంటనే పట్టుకోవాలని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ను ఆదేశించారు. ఈమేరకు ఆయన బుధవారం సాయంత్రం సీపీతో చర్చించారు.












Click it and Unblock the Notifications