ఎస్వీయులో బీభత్సం: మహిళ హత్య, నగల దోపిడీ
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. యూనివర్సిటీ ఏఏఓ శివశంకర్ భార్యను హత్య చేశారు. క్యాంపస్లోనే ఏఏఓగా పనిచేస్తున్న ఆయన క్వార్టర్స్లో ఉంటారు. ఆయన భార్య సుధపై దుండగులు వెనకవైపు నుంచి ఒక్కసారిగా దాడి చేశారు. ఆమెను హతమార్చి, ఆమె వద్ద ఉన్న నగలు దోచుకుని వెళ్లిపోయారు.
దొంగలు పట్టపగలే ఇంత బీభత్సం సృష్టించారు. తిరుపతిలో ఈ మధ్యకాలంలో ఇంత ఘోరం ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. ఒక మహిళను అత్యంత కిరాతకంగా గొంతుకోసి నగలు దోచుకెళ్లిన ఘటన పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రెండేళ్ల క్రితం ఇదే క్వార్టర్స్లో ఇలాంటి సంఘటన జరిగింది. ఓ మహిళను ఇలాగే గొంతుకోసం దోచుకెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందే ఈ దారుణానికి పాల్పడినట్లు అప్పట్లో విచారణలో తేలింది. తాజా కేసులో ప్రాథమిక ఆధారాలు మాత్రమే సేకరించామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. దోపిడీ దొంగల పనిగా భావించే విచారణ సాగుతోందని తెలిపారు.
దంపతుల సజీవ దహనం
విశాఖ జిల్లా మధురవాడ సమీపంలోని మారికవలస జేఎన్ఎన్యూఆర్ఎం గృహసముదాయంలో బుధవారం అర్ధరాత్రి దంపతులు సజీవ దహనమయ్యారు. శాలిపేటకు చెందిన ముత్యాల శ్రీనివాస్ (29), సత్యవతి (26)లకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరు పది రోజుల క్రితమే జేఎన్ఎన్యూఆర్ఎం గృహసముదాయంలోకి అద్దెకు దిగారు. వీరికి ఏడేళ్ల పాప హారిక ఉంది. సత్యవతికి శ్రీనివాస్ రెండో భర్త. సత్యవతికి మొదటి భర్త ద్వారా గౌతమి అనే కుమార్తె వుండగా ప్రస్తుతం ఆమె సాలిపేటలోని సత్యవతి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆ పాప విషయంలో దంపతులు తరుచూ గొడవపడేవారు.
బుధవారం గౌతమి పుట్టిన రోజు.ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సత్యవతి శాలిపేట వెళ్లింది. కాగా, రాత్రి తొమ్మిది గంటలకు శ్రీనివాస్ శాలిపేటవెళ్లి భార్యను తీసుకువచ్చాడు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు గది నుంచి పొగలు రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక దళం, పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే దంపతులిద్దరూ సజీవ దహనమయ్యారు. దంపతుల మధ్య అపోహలే ఈ ఘటనకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సత్యవతి, శ్రీనివాస్లకు ఒకరిపై మరొకరికి అనుమానమని, ఈ కార ణంగా తరచూ గొడవపడుతుండే వారని స్థానికులు చెబుతున్నారు.
అప్పులబాధతో హోంగార్డు ఆత్మహత్య
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఓ హోంగార్డు అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని త్రీటౌన్ పోలీస్స్టేషన్లో 2007 నుండి గుడిపూడి ఠాగూర్(30) హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఠాగూర్ హోంగార్డు గా పనిచేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక గురు వారం భార్య సుగుణను పుట్టింటికి పంపించి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.