న్యాయం జరగని తెలుగింటి ఆడపడుచు, ఏడాదిగా వేధింపు: భర్తపై మహిళ ఫిర్యాదు
విజయవాడ: తన భర్త తనను ఏడాది కాలంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా సర్పంచ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఓ టీవీ ఛానల్తోను మాట్లాడారు. తన భర్తపై గతంలో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఫేస్బుక్లోను భర్తపై విమర్శలు చేశారు.
న్యాయం జరగని తెలుగింటి ఆడపడుచు అంటూ ప్రారంభించారు. తన పేరు హరిణి కుమారి అని, గ్రామ సర్పంచ్గా పని చేస్తున్నానని, తన భర్త జిల్లా పార్టీ యూత్ లీడర్ అని, ఆయన పేరు రామకృష్ణ అని గత కొంతకాలంగా అతను తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు.
ఇలా వేధించినందుకు గాను గత ఏడాది తాను గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత తన భర్త తనపై ఒత్తిడి తెచ్చి కేసు వాపసు తీసుకునేలా చేశారని, తనకు ఎక్కడా న్యాయం జరగదని తెలిసి ఫేస్బుక్లో అందరికీ తెలిసేలా చెబుతున్నానని పేర్కొన్నారు. నా బాధను ఇలా చెబుతున్నానని అన్నారు.
నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ లేదని, కనీసం నా పిల్లల ప్రాణాలు అయినా కాపాడాలని అన్నారు. ఇలాంటి పరిస్థితి మరొక ఆడపడుచుకు రావొద్దని వాపోయారు.
కాగా, ఆమె టీవీ ఛానల్తో మాట్లాడుతూ.. తనను శారీరకంగా హింసించాడని, తాను పేరుకే సర్పంచ్ని అని, కానీ అంతా అతనిదే పెత్తనమని చెప్పారు. తనకు తొలుత రాజకీయాల గురించి తెలియదని, ఆ తర్వాత తెలుసుకున్నానని అన్నారు. నేను కూర్చుంటే అన్నీ తానే చూసుకుంటానని చెప్పేవాడన్నారు.