మహిళా టీచర్పై మేనల్లుడు కత్తితో దాడి (ఫోటోలు)
విశాఖపట్నం: గిరిజన ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన సోమవారం చింతపల్లిలోని దోమలగొంది గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... చింతపల్లి మండలంలో గల కొమ్మంగి పంచాయితీ రింతాడ గ్రామానికి చెందిన కొర్రా రత్న కుమారి (25) ఏడాదిన్నరగా బెస్నవరం పంచాయితీ దోమలగొంది గిరిజన సంక్షేమ శాఖ ప్రాధమికి పాఠశాలలో ప్రాధమిక ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈమెకు ఈనెల 16వ తేదీన హుకుంపేట మండలం అర్లాడ గ్రామానికి చెందిన ఎస్.దొర సింహాచలంతో వివాహం అయింది. సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలలను తెరవడంతో భర్తతో కలిసి ఆమె పాఠశాలకు చేరుకున్నారు. భర్తను పాఠశాల పక్కనే ఉన్న ఇంట్లో కూర్చోమని బడి పిల్లలను పిలుచుకు వచ్చేందుకు గ్రామంలోకి వెళ్లగా వరుసకు మేనల్లుడైన హోం గార్డు మాణిక్ రాజేష్ కత్తితో దాడి చేశాడు.
ఈదాడిలో రత్నకుమారికి తలపై, వెన్నుముకపై తీవ్రగాయాలయ్యాయి. స్కూలు పిల్లలు, బాధితురాలు కేకలు పెట్టడంతో ఆమె భర్త, గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. తీవ్రంగా రక్తస్రావమైన రత్నకుమారిని లోతుగెడ్డ పీహెచ్సీకి తీసుకువచ్చారు. వైద్యాధికారి సత్యనారాయణ తలపై 24 కుట్లు, వెన్నుముకపై 12 కుట్లు వేసి, 8 వేళ్లకు చికిత్స చేశారు.
పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. అన్నవరం ఎస్ఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్ధలానికి చేరుకొని దాడికి జరిగిన వివరాలు తెలుసుకున్నారు.
సమీప బంధువే ఈ దాడికి పాల్పడటంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. నిందితుడు రాజేష్ను రత్నకుమారి అన్నయ్య పెంచుకుంటున్నారు. వరుసకు మేనల్లుడు అవుతాడు. రత్నకుమారి తనన్ని పెళ్లి చేసుకుంటుందని రాజేష్ ఆశపడ్డాడని, తన కల నెరవేరకపోవడంతో కక్ష పెంచుకుని ఉండాడని స్ధానికులు అనుమానిస్తున్నారు.
ఈ దాడికి కుటుంబ కలహాలు గానీ, ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గానీ కారణమై ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో గిరిజిన ఉపాధ్యాయురాలిపై దాడి జరిగిన సంఘటటను తెలుసుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి లోతుగెడ్డ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.