ఒంటరి స్తీలకు చిత్తుగా కల్లు తాగించి చంపేశారు (ఫొటో)
హైదరాబాద్: కల్లు కాంపౌండ్లను స్థావరాలు చేసుకుని ఒంటరి మహిళలతో కల్లు తాగించి దొంగతనాలకు పాల్పడే ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. కాంపౌండ్లకు వచ్చే మహిళలను పరిచయం చేసుకుని సపర్యలు చేసి, మోతాదుకు మించిన కల్లు తాగించి, ఆ తర్వాత అక్కడి నుంచి నిర్మానుష్యప్రదేశాలకు తీసుకుని వెళ్లి ఒంటి మీద నగలను దోచుకోవడం, ప్రతిఘటించినవారిని హత్య చేయడం ఆ ముఠా పనిగా పెట్టుకుంది.
సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో కొంత కాలంగా జరుగుతున్న వరుస దోపిడీలపై, హత్యలపై డిసిపి జానకీ షర్మిల తీవ్రంగా ప్రతిస్పందించి సిసిఎస్ బృందాలను రంగంలోకి దింపారు. బాధితులంతా కల్లు కాంపౌండ్ల పేర్లే చెప్పడంతో వాటి వద్ద నిఘా పెట్టాలని ఆదేశించారు. ఆమె ఆదేశాలతో రాజేంద్రనగర్, మల్కాజిగిరి సిసిఎస్ పోలీసు బృందాలు మాటు వేసి రెండు వేర్వేరు ముఠాలకు చెందిన నలుగురిని గుర్తించి, అరెస్టు చేసారు.
రాజేంద్ర నగర్కు చెందిన వరికుప్పల పార్వతమ్మ అలియాస్ పవిత్ర (25), వొర్సు వెంకటయ్య (40) ఒక ముఠాగా, మహబూబ్నగర్కు చెందిన దండుగుల తిమ్మప్ప (55), దండుగుల శివం అలియాస్ ఎల్లం (35) మరో ముఠాగా ఏర్పడి కల్లు కాంపౌండ్ల వద్ద మాటు వేసి దినసరి కూలీ పనిచేసి కల్లు తాగేందుకు ఒంటరిగా వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వారితో మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు. సొంత డబ్బులు పెట్టి మోతాదుకు మించి కల్లు తాగించారు.
ఆ తర్వాత ఆటోలో నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకని తీసుకుని వెళ్లి వారి ఒంటి మీది నగలును, వారి వద్ద ఉన్న నగదును దోచుకున్నారు. ప్రతిఘటించినవారిని హతమార్చారు. ఈ క్రమంలో పార్వతమ్మ, వెంకటయ్యల ముఠా రాజేంద్రనగర్లోని హైదర్గుడా కల్లు కాంపౌండ్లో మే 4వ తేదీన కల్లు తాగేందుకు వచ్చిన నాగమ్మ (30)ను పరిచయం చేసుకున్నారు. ఆమెకు చిత్తుగా కల్లు తాగించి ఆటోలో శంషాబాద్ పరిధిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఒంటి మీద నగలును, నగదును దోచుకున్నారు. ప్రతిఘటించడంతో ఆమెను చంపేశారు.
రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, మల్కాజిగిరి పోలీసు స్టేషన్ల పరిధుల్లోని కల్లు కాంపౌండ్ల వద్ద ఈ నెల 12వ తేదీన భవానీనగర్కు చెందిన చంద్రకళను, 13వ తేదీన జంగమ్మను, మే 5వ తేదీన కుమ్మరి వెంకటయ్య భార్య గంగమ్మలను అదే పద్ధతిలో నిలువుదోపిడీ చేశారు. చంద్రకళ కడియాలు రాకపోవడంతో ఆమె కాళ్లను నరికేసి వాటిని దొంగిలించారు. మే 4వ తేదీన నాగమ్మ అనే మహిళను హత్య చేశారు.