రిషికేశ్వరి ఆత్మహత్య: సిఎం క్యాంపు ఆఫీస్ ముట్టడి, చంద్రబాబుతో పేరెంట్స్ భేటీ
విజయవాడ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషికేశ్వరి మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, విద్యార్థులు, మహిళలు శుక్రవారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, భారీ సంఖ్యలో వచ్చిన విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
చంద్రబాబుతో రిషికేశ్వరి తల్లిదండ్రుల భేటీ
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఏపి సిఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
శుక్రవారం ఉదయం ఏపి విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసిన వారు, ఆ తర్వాత నేరుగా సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిషికేశ్వరి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు చంద్రబాబును కోరారు.
ఏపీ కేబినెట్ భేటీ
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో తొలుత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణం, హౌసింగ్ అంశాలపై చర్చించారు. హుధుద్ తుఫాను బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది.