చంద్రబాబు ఇజ్జత్ పాయె..!!
హైదరాబాద్: వరల్డ్ కప్ 2023లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ తన రెండో మ్యాచ్లో అదరగొట్టింది. శ్రీలంకను చిత్తు చేసింది. ఆ జట్టు అద్భుతమైన ఫామ్లో ఉన్నామనే సందేశాన్ని పంపించింది. వరుసగా రెండో మ్యాచ్లో విజయదుందుభి మోగించింది. భారత్తో మ్యాచ్కు ముందు బూస్ట్ లాంటి సక్సెస్ను అందుకుంది బాబర్ ఆజమ్ సేన.
ఇదే హైదరాబాద్ ఉప్పల్ పిచ్పై ఇదివరకు నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ విజయ కేతనాన్ని ఎగురవేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 286 పరుగులు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు తడబడింది. 41 ఓవర్లల్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది.

రెండో మ్యాచ్లో శ్రీలంకకు చుక్కలు చూపింది. శ్రీలంక నిర్దేశించిన 344 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా కొట్టి పడేసింది పాకిస్తాన్. నాలుగు వికెట్ల నష్టానికి 345 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించిందంటే ఆ జట్టు దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు స్టాండ్స్లో ఓ ఆసక్తికర ప్లకార్డ్ కనిపించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్లకార్డ్ అది. ఆయనను స్కామ్స్టర్గా పేర్కొంటూ కొందరు ప్రేక్షకులు ఈ ప్లకార్డ్ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆంధ్రా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో 371 కోట్ల రూపాయలను చంద్రబాబు దొంగిలించారనే అనే అక్షరాలను ఇంగ్లీష్లో ఈ ప్లకార్డ్పై ముద్రించారు. పక్కన చంద్రబాబు ఫొటోను ప్రింట్ చేశారు. ప్లకార్డ్ పైభాగంలో స్కామ్స్టర్ బాబు అని, కింది భాగంలో కరప్ట్ టీడీపీ అని రాశారు. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లో ఈ ప్లకార్డును ప్రదర్శించడం వల్ల అది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించినట్టయింది.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications