చంద్రబాబు భయపడుతున్నారు: విశ్వేశ్వర రెడ్డి, మంత్రి పదవుల కోసమన్న రామకృష్ణ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. హంద్రీ నీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు.
హంద్రీ నీవా ప్రాజెక్ట్ పూర్తయితే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.
అనంత ఆయుకట్టును నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలను ఎట్టి పరిస్థితిలో సహించమని తేల్చి చెప్పారు.

అవసరమైతే కాల్వలను పగలగొట్టి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. ఈ అంశంపై ఆగస్టు 3న ఉరవకొండలో అన్ని రాజకీయా పార్టీల కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వై విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.
మంత్రి పదవుల కోసమే బాబు నోరుమెదపడం లేదు
కేంద్రంలో మంత్రి పదవుల కోసమే ఏపి సిఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్ల ప్యాకేజీ అన్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆగస్టు 1 నుంచి 9వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సిపిఐ బస్సు యాత్ర నిర్వహిస్తుందని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే 11వ తేదీన బంద్ నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications