బాబు క్షేమం కోసం నడుం బిగించిన కేశినేని నాని.. కార్యసిద్ధి
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని, దర్యాప్తు సాగిస్తోన్నారు.

ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని.. దేవభూమి ఉత్తరాఖండ్లో యాగానికి పూనుకున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రిషికేశ్లో ఈ యజ్ఞ యాగాదులను నిర్వహించారు. పవిత్ర గంగానది ఒడ్డున ఈ యజ్ఞం ముగిసింది. వేదమంత్రోచ్ఛారణలు, వేద పండితులు విజయవంతంగా ఈ క్రతువును జరిపారు.
చంద్రబాబుకు త్వరగా బెయిల్ లభించాలని ప్రార్థించినట్లు కేశినేని నాని వెల్లడించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, పూర్ణాయుష్షుతో జీవించాలని కోరుకున్నానని పేర్కొన్నారు. ఈ కార్యసిద్ధం యజ్ఞం ద్వారా అన్నీ నెరవేరుతాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని చెప్పారు.

విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనల సందర్భంగా కేశినేని నాని.. చంద్రబాబును కలుసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం అనంతరం ఆయన చంద్రబాబును కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు అరెస్ట్ కావడం, విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో మర్యాదపూరకంగా కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications