టీడీపీనే అంటారా: మోడీపై యామిని సాధినేని నిప్పులు, కాంగ్రెస్తో దోస్తీపై సరికొత్త లాజిక్!
అమరావతి: వచ్చే జనవరి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ అంతకంటే ఎక్కువ ప్రయోజనం కేంద్రం నుంచి వచ్చిందని, చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వంటి నేతలు నాలుగున్నరేళ్ల బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు 2019 జనవరి 6వ తేదీన ఏపీకి రానున్నారు. దీనిపై తాజాగా, టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని స్పందించారు.

కాంగ్రెస్కు వ్యతిరేకంగా కాదు.. దోస్తీపై లాజిక్ టీడీపీ యామిని లాజిక్
టీడీపీ ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా పెట్టింది కాదని, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని యామిని సాధినేని కొత్త లాజిక్ లాగారు. బీజేపీ నేతలతో పాటు వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కాంగ్రెస్ - టీడీపీ పొత్తుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టి చంద్రబాబు.. ఎన్టీఆర్కు ఆత్మ ఘోషించేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై యామిని కొత్త లాజిక్ లాగారు. టీడీపీ ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా పుట్టలేదని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని చెప్పడం గమనార్హం.

మోడీ వ్యాఖ్యలపై యామిని మండిపాటు
యామిని సాధినేని ఇంకా మాట్లాడుతూ... జనవరి ఆరో తేదిన ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. విభజన హామీలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేసి ఏపీ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సైద్ధాంతిక విలువలకు తిలోదకాలిచ్చి టీడీపీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయంటూ తమిళనాడులో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.

అందుకే కూటమి
నవ్యాంధ్ర ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని యామిని చెప్పారు. మోడీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడి గద్దె దించే ప్రయత్నంలోనే భాగంగానే కూటమి ఏర్పాటు చేసిన విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరంచేసి సీబీఐ, కాగ్ లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.

చంద్రబాబు ఆగ్రహం
అంతకుముందు, ఆదివారం చంద్రబాబు కూడా ప్రధానిని ప్రశ్నించారు. ఏపీకి వచ్చేముందు ఇచ్చిన హామీలను, ఏ మేరకు నెరవేర్చానో ఆయన తెలుసుకోవాలని వమర్శించారు. ఏపీ ప్రజలు చచ్చారో, బతికారో తెలుసుకునేందుకు వస్తున్నారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ కోసమే తాము బీజేపీతో నాలుగేళ్లకు పైగా కలిసి ఉన్నామని చెప్పారు. ఏపీ భారత దేశంలో భాగం కాదా చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications