జగన్ సైకో.. ఆయనిష్టం, పవన్ కళ్యాణ్ వస్తారు: నిజామాబాద్లో యనమల
విజయవాడ/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ సైకో నేత అని, రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావడం.. రాకపోవడం ఆయన ఇష్టమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు.
శంకుస్థాపనకు జగన్ నిరాకరించడం సిగ్గుచేటు అన్నారు. ఆయన ఓ సైకో నేత అన్నారు. శంకుస్థాపనకు రానని చెప్పడం దురదృష్టకరమని చెప్పారు. జగన్ రాకపోవడాన్ని వైసిపి నేతలే తప్పుపడుతున్నారన్నారు. తాము అతి తక్కువ ఖర్చుతో భూమి పూజ నిర్వహించామన్నారు.
విభజన జరిగినా తెలుగు రాష్ట్రాల ఔన్నత్యమే తమకు ముఖ్యమని యనమల చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెప్పిస్తున్నామని యనమల చెప్పారు. అమరావతి శంకుస్థాపనకు పవన్ కళ్యాన్ తప్పకుండా వస్తారని తాము ఆశిస్తుట్లు యనమల చెప్పారు.
ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన కోసం నీలకంఠేశ్వరస్వామి ఆలయం మట్టిని, నిజాంసాగర్ మట్టిని జిల్లా టిడిపి నేతలు యనమలకు అందించారు. యనమల మాట్లాడుతూ... ఏపీ ప్రజలు గర్వపడేలా అమరావతి నిర్మాణం ఘనంగా చేస్తున్నట్లు చెప్పారు.
అమరావతికి అమరజీవి ఆత్మార్పణ స్థల మట్టి
ఏపీ రాష్ట్ర అవతరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు చెన్నైలో ప్రాణత్యాగం చేసిన ప్రాంతం నుంచి మట్టిని, నీటిని సేకరించి అమరావతి శంకుస్థాపనకు పంపించారు. తెలుగు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. మైలాపూర్లో నాడు శ్రీరాములు ఆమరణ దీక్ష చేసిన ప్రాణత్యాగం చేశారు.
అమరావతికి తరలించేందుకు సౌదీ అరేబియాలోని మక్కాలో గల హరాం మసీదులోని జాంజాం బావి జలాలను చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిషత్తు కార్యాలయానికి ఆదివారం అందాయి. శవణప్పగారిపల్లికి చెందిన సారథినాయుడు రాజధాని నిర్మాణానికి అక్కడి జాంజాం నీటిని కళశంలో నీటిని నింపి తెచ్చారు.
గిన్నిస్ ఖాయం: కేశినేని నాని
ప్రజా రాజధానిగా అమరావతికి గిన్నిస్ రికార్డ్ ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని సోమవారం అన్నారు. ఆయన బెజవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అమరావతి గిన్నిస్ రికార్డులకు ఎక్కుతుందన్నారు.
విజయవాడలో దేశంలో అరుదైన ఫ్లై ఓవర్ను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల చేశామని, మరో పది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కొత్తగా నిర్మితం కానున్న ఫ్లై ఓవర్ దేశంలోనే అత్యంత ప్రత్యేకమైనదిగా రికార్డులకు ఎక్కుతుందన్నారు.