'పవన్ కళ్యాణ్ను అసహ్యించుకుంటున్నారు, మీవల్లే అశాంతి, ఫిర్యాదు చేస్తారా'
అమరావతి: బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్ నరసింహన్కు ఏపీ బీజేపీ నేతల వినతి నమ్మకద్రోహానికి పరాకాష్ట అన్నారు.
Recommended Video

ఢిల్లీ డైరెక్షన్లోనే ఆ బీజేపీ నేతల రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంపై పరోక్షంగా పెత్తనం చేయాలన్నదే బీజేపీ అధిష్టానంకుట్రగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అశాంతి సృష్టించేది బీజేపీవారేనని, శాంతిభద్రతలపై ఫిర్యాదు చేసేది వారేనని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ అలా అనడం అవగాహనలేమి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉత్తరాంధ్ర ఉద్యమం అంటూ రెచ్చగొట్టిస్తున్నారని యనమల ఆరోపించారు. వైసీపీ అధినేత వైయస్ జగన్తో కులాల చిచ్చు రగిలించాలని చూస్తారని నిప్పులు చెరిగారు. తాను చేసిన ప్రచారం వల్లనే టీడీపీకి అధికారం దక్కిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఆయన అవగాహనా లేమికి నిదర్శనమన్నారు.

పవన్ రెచ్చగొడుతున్నారు
పవన్ కళ్యాణ్ ఓ వైపు బీజేపీతో అంటకాగుతూ మరోవైపు లెఫ్ట్ పార్టీలతో మీటింగ్లు పెడుతున్నారని ఇదేం తీరు అని యనమల నిలదీశారు. టీడీపీపై చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమమంటూ యువతను ఆయన రెచ్చగొడుతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ వైఖరితో అసహ్యించుకుంటున్నారు
టీడీపీ ఆయన వల్ల అధికారంలోకి రాలేదని, ఏపీ ప్రజలు నమ్మడం వల్లే వచ్చామని యనమల అన్నారు. ఆయన బీజేపీతో ఉంటారో, లెఫ్ట్ నేతలతో ఉంటారో తేల్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనని పవన్ వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

ఎంతమంది వచ్చినా అడ్డుకోలేరు
జగన్, పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎంతమంది వచ్చినా టీడీపీని అడ్డుకోలేరని యనమల అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం అయ్యాయని తప్పుడు ఫిర్యాదు చేస్తారా అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రంపై పెత్తనం సాగించాలని బీజేపీ చూడటం విడ్డూరంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications