గన్నవరంలో సీన్ ఛేంజ్, లైన్ క్లియర్ - హోరాహోరీ..!!
గన్నవరంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలో యార్లగడ్డ పార్టీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ముఖ్య నేతల నుంచీ ఇవే రకమైన సంకేతాలు వస్తున్నాయి. టీడీపీ నుంచి యార్లగడ్డ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే, వంశీ వర్సస్ వెంకటరావు గా మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీంతో హోరా హోరీ పోరు తప్పేలా లేదు.
మారుతున్న రాజకీయం
గన్నవరం రాజకీయంగా మరో సారి ఆసక్తి కరంగా మారుతోంది.వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలో యార్లగడ్డ వెంకటరావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. తాను వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తానని స్పష్టం చేసారు.

సీటు ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్ ను ప్రజలే నిర్ణయిస్తారని పరోక్షంగా తన రూట్ స్పష్టం చేసారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పార్టీని కోరారు. కానీ, వైసీపీ ముఖ్య నాయకత్వం మాత్రం ఇందుకు సిద్దంగా లేదనే విషయం స్పష్టం అవుతోంది. వెంకట్రావు టీడీపీ లోకి వెళ్లాలని నిర్ణయించుకొనే ఈ సమావేశం ఏర్పాటు చేసారనే అభిప్రాయంతో ఉన్నారని వైసీపీ భావిస్తోంది.
ఆ ఇద్దరే మరోసారి పోటీ
వంశీ వైసీపీలోకి వచ్చిన సమయం నుంచి రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు వ్యతిరేకంగా ఉన్నారు. వంశీతో కలిసి పని చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా తన పైన 19 కేసులు..దుట్టా రామచంద్రరావుపై 11 కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల మీద కేసులు మాఫీ జరిగినా ఒక్క గన్నవరంలో మాత్రమే అసలైన వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు ఎత్తివేయలేదని వివరించారు.

2019 ఎన్నికల్లో అప్పటి ప్రత్యర్థి దొంగ ఇళ్ల పట్టాలు, రిగ్గింగ్ కారణంగా స్వల్ప ఓట్లతోనే నేను ఓడానంటూ పరోక్షంగా వంశీ పైన వ్యాఖ్యలు చేసారు. ఇద్దరు మంత్రులు చేసిన పని వల్ల ఈ రోజున గన్నవరంలో టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారని చెప్పుకొచ్చారు.
హోరా హోరీ ఖాయమా
ఇక, ఇప్పుడు యార్లగడ్డ పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీ నుంచి యార్లగడ్డ గన్నవరం అభ్యర్ది పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో వైసీపీ నుంచి వంశీకి రూట్ క్లియర్ అయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వంశీ, వైసీపీ నుంచి వెంకట్రావు పోటీ పడ్డారు. ఇప్పుడు వెంకట్రావు టీడీపీ సీటు ఇస్తే తిరిగి ఈ ఇద్దరు అభ్యర్ధులే మరోసారి ప్రత్యర్ధులుగా పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు గన్నవరం లో మారుతున్న రాజకీయాలు.. ఈ ఇద్దరు నేతలు నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications