వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు...చంద్రబాబు పొగ పెట్టేశారా...?
తమ రాజకీయ భవిష్యత్తుపై వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైందా?...ముప్పేటలా దాడి అంటే ఏంటో వారికి ఇప్పుడు అనుభవమైందా?...తమ పొలిటికల్ కెరీర్ లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యే అదృష్టం ఉందో లేదో అని భయపడుతున్నారా?...అంటే అవుననే అంటున్నాయి వరుసగా జరుగుతున్న పరిణామాలు...
ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాకుండా...వైసిపి నుంచి టిడిపి లోకి జంప్ చేసి ఏకంగా మంత్రులైన వారి పరిస్థితి కూడా ఇదేనట. సీట్ల పెంపు ఉండదని తేలిపోవడం...వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని అనర్హులుగా ప్రకటించాలని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేయడం...ఈ రెండు దెబ్బలకే బిత్తరపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు తాజాగా అసలు సిసలు షాక్ ఇచ్చారట. చంద్రబాబు మార్క్ ఆ దెబ్బతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారట. మీ దారి మీరు చూసుకోవడం బెటరనే సంకేతం ఇచ్చేందుకే చంద్రబాబు ఈ లేటెస్ట్ షాక్ ఇచ్చారని ఫిరాయింపు ఎమ్మెల్యేలు మథనపడిపోతున్నారట. ఇంతకీ చంద్రబాబు ఇచ్చిన ఆ షాక్ ఏమిటంటే...
సర్వే పేరుతో షాక్...టికెట్ హుళిక్కేనా?...
సీట్ల పెంపు ఉండదని తేలిపోవడంతో వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలు తనకు భవిష్యత్తులో తల నొప్పిగా మారే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు వారిని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారా?...అంటే అవుననే లాగే కనిపిస్తున్నాయి కొన్ని తాజా పరిణామాలు. అదెలాగంటే...ఈమధ్యే(అంటే ఎప్పుడని అడగొద్దు) రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ప్రజామోదం విషయమై చంద్రబాబు ఒక సర్వే చేయించారట. ఆ సర్వేలో చాలా మంది ఎమ్మెల్యేలకు నెగిటివ్ మార్కులే పడ్డాయట...అందులోనూ వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇంకా ఎక్కువ నెగిటివ్ మార్కులు వచ్చాయట. వారిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి మంత్రులు అయినవారు కూడా ఉన్నారట. అందుకే ఆయా నియోజకవర్గాల్లో వేరే అభ్యర్థులను బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారట...ఈ విషయం తెలియడంతోనే వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో బండరాయి పడినట్లయిందట.
ఇంతకీ ఈ విషయం...ఎలా తెలిసిందంటే?...
మీ పనితీరు బాగాలేదని సర్వేలో వెల్లడయింది...చూసుకోండంటూ చంద్రబాబు ముందుగా కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నేరుగా నివేదిక అందచేశారట. అది చూసుకున్న ఫి.ఎ లకు మతిపోయినంత పనైందట. అంతేకాదు తమ భవిష్యత్తు తలుచుకొని వణికిపోయారట. కారణం చంద్రబాబు ఈ విధంగా సర్వే రిపోర్ట్ తమ చేతిలో పెట్టడం వెనుక తమని పొమ్మనలేక పొగబెట్టడానికేనని వారు అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన వెంటనే మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఈ సర్వే విషయం నిజమా అబద్దమా అని వీరికి ఫోన్ చేసి ఆరా తీసి...నిజమేనని తెలియడంతో ఆ వణుకు వారికి కూడా పాకిందట.
వదిలించుకోవడానికే...ఫిక్సయిపోయారు...
సీట్ల పెంపు ఉంటే ఏదోలాగా మేనేజ్ చేయచ్చనుకున్న చంద్రబాబు...ఇక అది సాధ్యంకాదని తెలియడంతోనే ముందుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలనే వదిలించుకునే ఆలోచన చేశారట. చివరివరకు వీరికి అసలు విషయం చెప్పకుండా ఉంచితే అప్పుడు వీరి వల్ల వచ్చే నష్టం ఎక్కువగా ఉండొచ్చని భావించిన చంద్రబాబు ముందే వారిని మానసికంగా సన్నద్దం చేస్తున్నారట. ఎవరైనా ఈ విషయం టిడిపి సీనియర్ల దగ్గర ఆరా తీస్తే...బాబు గారి దగ్గర పేమెంట్ తీసుకుంటే అంతే...అడగటానికి ఉండదు...అయినా మీరు గెలవరని సర్వేలో తేలితే టికెట్ ఎలా ఇస్తారు...ఇవ్వమని ఎలా డిమాండ్ చేస్తారు అనేశారట. దీంతో టిడిపికి తమ అవసరం ఇక తీరిపోయిందని బాబు భావిస్తున్నరని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిక్సయిపోయారట.
ఇప్పుడేం చెయ్యాలి...వైసిపికి నో వే!
ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన పట్టుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫ్యూచర్ గురించి ఆలోచించి మళ్లీ వైసిపికి వెళదామంటే జగన్ ఎవరికి ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా వీరికి మాత్రం వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం మాత్రం ఇవ్వడని వైసిపి సీనియర్లు స్పష్టం చేసేశారట. అందుకు నిదర్శనంగా జగన్ మిగిలిన నియోజక వర్గాల సంగతి అటుంచి ముందుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ముందుగానే కొత్త అభ్యర్థుల్ని ఖరారు చేసేశారట. వీరు వైసిపిలోకి రావాలనుకుంటే ఎమ్మెల్యే సీటు మీద ఏమాత్రం ఆశ పెట్టుకోకుండా అయితేనే రావాలట...దీంతో ఎమ్మెల్యేగా అవకాశం లేనప్పుడు తిరిగి వైసిపిలోకి వెళ్లి మరింత నవ్వులుపాలు కావడం దేనికని ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెగ ఆలోచిస్తున్నారట...
జలీల్ ఖాన్...టైమొచ్చింది...అనూహ్యం...
అయితే వీరిలో ఇప్పుడు చాలామంది జలీల్ ఖాన్ ను చూసి అసూయ పడుతున్నారట. కారణం మొన్నటిదాకా బికాంలో ఫిజిక్స్ అంటూ ఇంటా బైట నవ్వులపాలయిన(అదే కారణంగా మంత్రి పదవి కూడా చేజారిందని టాక్) జలీల్ ఖాన్ నిన్నటి దాకా ఇదే లిస్ట్ లో ఉన్నా...అనూహ్యంగా రాష్ట్రంలో మారిన పరిస్థితుల కారణంగా ఈ లిస్ట్ నుంచి బైటపడ్డారట. కారణం జలీల్ ఖాన్ మైనారిటీ నేత కావడం...పవన్ కణ్యాణ్ మీద ఎదురు దాడి చేసేందుకు...బిజెపితో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ పార్టీని దుమ్మెత్తి పోసేందుకు జలీల్ ఖాన్ అవసరం ఎంతగానో ఉన్నందునే ఆయన ప్రస్తుతానికి సేఫ్ జోన్ లోకి రావడమే కాదు కొన్నాళ్లపాటు టిడిపి తరుపున మీడియాలో హైలెట్ అవనున్నారని, ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఆదేశాల మేరకు అనర్హత వేటు పడినా జలీల్ ఖాన్ కు టిడిపిలో మళ్లీ రెడ్ కార్పెట్ స్వాగతం ఖాయమట...అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇంతటి దురదృష్టంలోనూ జలీల్ ఖాన్ కి మాత్రం ఎంతటి అదృష్టం పట్టిందని అసూయ చెందుతున్నారట...