ఆనంకు మరో భారీ షాక్ - "మార్పు" ఖాయంగా..!!
వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి మరో భారీ షాక్. సొంత ప్రభుత్వంపైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయటంతో ఆనం నియోజకవర్గంలో కొత్త ఇంఛార్జ్ ను నియమించారు. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ గా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి ఆనం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆనం పార్టీని వీడే ఆలోచనతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ అధినాయకత్వం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే వరుసగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పుడు ఆనం కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..నెల్లూరు రాజకీయాల్లో పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ఆనం రామనారాయణ రెడ్డి వ్యక్తిగత భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఆనం వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లోనే వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొంత కాలం నుంచి రామనారాయణ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. పలు సందర్భాల్లో ప్రభుత్వం..పార్టీ తీరు పైన ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా వరుసగా సమావేశాల్లో ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలతో ఆయన పైన చర్యల దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగా.. ఇప్పుడు ఆనం కు ఉన్న 2+2 వ్యక్తిగత సెక్యూరిటీని కుదించి 1+1 గా మార్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ సెక్యూరిటీని 2+2 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మరో నేతను ఇంఛార్జ్ గా నియమించటం పైన ఆనం స్పందించ లేదు. ఆనం కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచి ఒకే పార్టీలో ఉన్నా.. నేదురుమల్లి కుటుంబంతో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు తన నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఆనం రాం కుమార్ రెడ్డిని నియమించటం తో ఆయన భవిష్యత్ అడుగుల పైన ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు మాత్రం ఆనం పార్టీలో ఉంటే ఖచ్చితంగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిదేనని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆనం వచ్చే ఎన్నికల కోసం టీడీపీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు సైతం ఆనం తీరు..హైకమాండ్ నిర్ణయాల పైన ఆచి తూచి స్పందించారు. రానున్న రోజుల్లో నెల్లూరు కేంద్రంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.