విశాఖ ఎఫెక్ట్ - అమరావతిలో వైసీపీ అలర్ట్ : 23న ముహూర్తం - గెలుపెవరిది..!!
ఉత్తరాంధ్ర సీటులో టీడీపీ విజయం దిశగా దూసుకెళ్లోంది. దీంతో. ఇప్పుడు అమరావతిలో జరిగే ఎన్నిక కోసం వైసీపీ అలర్ట్ అవుతోంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనే గెలుపొందింది. కానీ, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. రాయలసీమ రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర సీటులో మాత్రం టీడీపీ విజయం దిశగా దూసుకెళ్లోంది. దీంతో...ఇప్పుడు అమరావతిలో జరిగే ఎన్నిక కోసం వైసీపీ అలర్ట్ అవుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరా హోరీ
విశాఖ కేంద్రంగా కొంత కాలంగా రాజకీయం సాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో గెలుపును వైసీపీ - టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ అభ్యర్ధి గెలుపు బాధ్యతలను మంత్రులతో పాటుగా పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్..టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. టీడీపీ చివరి నిమిషంలో అభ్యర్ధిని మార్పు చేసింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలతో టీడీపీ అభ్యర్ధి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇది వైసీపీ ఊహించని ఫలితం. అటు రాయలసీమలోనూ టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. పీడీఎఫ్ తో ఓటింగ్ కోసం చేసుకున్న అవగాహన కలిసి వచ్చింది. ఇక్కడ రెండు సీట్లలోనూ రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగింది. దీంతో..ఇప్పుడు అమరావతి పైన వైసీపీ ఫోకస్ చేసింది.

విశాఖ ట్రెండ్స్ తో వైసీపీ అలర్ట్
ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం తొమ్మది స్థానాల్లో అయిదు ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసారు. వైసీపీకి ఉన్న సంఖ్యా బలంతో ఏడు స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని భావించారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ నామినేషన్ దాఖలు చేసారు. శాసనసభలో స్పీకర్ మినహా వైసీపీకి 150 మంది సభ్యులున్నారు. వీరిని ఏడుగురు అభ్యర్థులకూ కేటాయిస్తే ఒక్కొక్కరికి 21.43 మంది చొప్పున ఓటేయాలి. టీడీపీకి 23 మంది సభ్యులుండగా, వారిలో నలుగురు వైసీపీకి మద్దతు పలుకుతున్నారు.
అమరావతిలో గెలుపెవరది
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలతో వైసీపీ ఈ ఎన్నిక పైన అలర్ట్ అయింది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలనూ కైవసం చేసుకోవడంపై వైసీపీ దృష్టిసారించింది. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రతి అభ్యర్థికీ 22 మంది శాసనసభ్యులు ఓటర్లుగా ఉండాలని నిర్ణయించారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన నలుగురితో ఓటు వేయిస్తే తమ అభ్యర్థులు గెలుస్తారని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీకి ఓట్లు వేస్తే పాలకపక్షానికి రెండు ఓట్లు తగ్గుతాయి. అలాగే వైసీపీ నుంచి మరో ఇద్దరు శాసనసభ్యులు టీడీపీకి మద్దతు పలుకుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఒకటికి రెండుసార్లు మాక్ ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. రెండు పార్టీల్లోని రెబల్స్ ఈ ఎన్నికలో కీలకం కానున్నారు. దీంతో..అమరావతిలో ఈ నెల 23న జరిగే ఈ ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications