నెల్లూరు వైసీపీ నేతలకు హైకమాండ్ వార్నింగ్ - నేడే పోటా పోటీ సభలు : ఏం జరుగుతోంది..!!
నెల్లూరు వైసీపీ నేతల కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. తాజా వర్సెస్ మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పార్టీ శ్రేణులకు ఇరకాటంగా మారింది. దీని పైన వైసీపీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. దీంతో పార్టీ ముఖ్యనేత నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో మాట్లాడారు. ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహించుకున్నా..ఎక్కడా హద్దు దాటవద్దంటూ హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు వస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ నగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేసారు.
మంత్రిగా కాకాని వచ్చే వేళ..అనిల్ సభ
పార్టీ సభతో పాటుగా ఇఫ్తార్ విందు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో కాకాని మంత్రి హోదాలో నెల్లూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఇది నెల్లూరు వైసీపీలో గందరగోళానికి కారణమైంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు.
తనకు ఆహ్వానం లేదని అనిల్ స్పష్టం చేసారు. అదే సమయంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తనకు కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎటువంటి సహకారం అందిందో..దానికి రెండింతల సహకారం తన నుంచి ఉంటుందని అనిల్ చేసిన సెటైరికల్ వ్యాఖ్యలతో కొత్త వివాదం మొదలైంది.
మాజీ వర్సెస్ తాజా మంత్రుల కోల్డ్ వార్
ఇక, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి నెల్లూరు సిటీలో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను తొలిగించారు. దీంతో..ఇద్దరు నేతల అభిమానుల మధ్య ఇది వివాదానికి కారణమైంది.
అయితే, తాను ఎవరికీ వ్యతిరేకంగా సభ ఏర్పాటు చేయలేదని..ముందుగానే నిర్ణయించిన కార్యక్రమంగా అనిల్ చెప్పుకొచ్చారు. తాను జగన్ విధేయుడినని చెబుతూ..జగన్ కోసం ఏదైనా చేస్తానని చెప్పారు. అయితే, సభ వద్దని తనకు ఎవరూ సూచించలేదన్నారు. ఇక, ఇద్దరూ ఈ సాయంత్రం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అధినాయకత్వం ఆగ్రహం...హెచ్చరిక
ఈ ప్రసంగాల్లో ఇద్దరు నేతలు ఏం మాట్లాడుతారనేది మరో ఆసక్తి కర అంశంగా మారింది. అయితే, వైసీపీ ముఖ్యనేత ఇద్దరు నేతలకు ఫోన్ చేసి..వివాదాస్పదంగా వ్యవహరించవద్దని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. సభ ఏర్పాట్లను ఇప్పటికే అనిల్ పర్యవేక్షించారు.
ఇక, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఆయన అనుచరులు సిద్దం అవుతున్నారు. గతంలోనూ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగించింది. ఇప్పుడు తిరిగి అదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో..నెల్లూరు వైసీపీలో ఈ పోటా పోటీ సమావేశాలతో ఏం జరగనుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.