అసెంబ్లీలో వైపీపీ..మండలిలో టీడీపీ: అక్కడి వ్యూహాలకు..ఇక్కడ ప్రతివ్యూహాలు: ఏ వీడియో నిజం..!
Recommended Video
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. శాసనసభలో సీఎం జగన్ వర్సెస్ ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్దం సాగుతోంది. అసెంబ్లీలో అధికార పక్షం పై చేయి సాధిస్తున్నట్లుగా కనిపిస్తుంటే..దీనికి టీడీపీ రివర్స్ ప్లాన్ వేసింది. శాసనసభలో వైసీపీ మెజార్టీ ఉండగా..శాసన మండలిలో మాత్రం టీడీపీ సభ్యులే అధికంగా ఉన్నారు. దీంతో..అసెంబ్లీలో ప్రభుత్వం తమను ఏ అంశంలో..ఏ రకంగా టార్గెట్ చేస్తోందో..అదే విధంగా శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. తాజాగా మార్షల్స్..టీడీపీ వివాదం పైన అసెంబ్లీలో చంద్రబాబు పైన అధికార పక్షంగా ఏకపక్షంగా విమర్శల దాడి చేసింది. కానీ, మండలిలో మాత్రం భిన్నంగా పరిస్థితి కనిపించింది. టీడీపీ మండలి ఛైర్మన్ ద్వారా మార్షల్ ను పిలిపించి మరీ విచారణ కోరే విధంగా ఒత్తిడి తెచ్చింది. దీంతో..మిగిలిన రెండు రోజుల సమావేశాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
నన్ను అవమానించేందుకే అసెంబ్లీ: ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు
అసెంబ్లీలో అధికార పక్షం దూకుడు..
అసెంబ్లీలో అధికార వైసీపికి 151 మంది సభ్యుల మద్దతు ఉంది. టీడీపీ నుండి 23 మంది మాత్రమే ఉన్నారు. అందునా వంశీ పార్టీతో విభేదించగా.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సభకు హాజరు కావటం లేదు. ఇక, తాజాగా అసెంబ్లీ మార్షల్స్..టీడీపీ వివాదం పైన అధికార పక్షం ముందస్తు ప్రణాళికతో ఏకపక్షంగా ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇరుకున పెట్టింది. వీడియోలను సభలో ప్రదర్శించి చంద్రబాబు మార్షల్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారని..అదే విధంగా మాజీ మంత్రి లోకేశ్ మార్షల్ పీక పట్టుకున్నారంటూ కార్నర్ చేసారు. ఒక విధంగా ఆ చర్చ జరుగుతున్నంత సేపు టీడీపీ ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపించింది. ఆ తరువాత కొద్ది సేపటికి చంద్రబాబు తనను అవమానించిన వారు ఏం చేస్తారో చెప్పాలంటూ నిలదీసారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ పార్టీ నుండి సభకు సమాచారం రావటం తో ఇక..టీడీపీ తేరుకుంది. అయితే, అప్పటికే సభలో దిశ బిల్లు అంశం చర్చ మొదలైంది.
మండలిలో టీడీపీ బలంతో..
శాసన మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటం కలిసి వస్తోంది. గురువారం తమను మార్షల్స్ అడ్డుకోవడంపై టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ షరీఫ్కు ఫిర్యాదు చేశారు. ఆయన అసెంబ్లీ చీఫ్ మార్షల్ను పిలిపించి విచారణ నిర్వహించారు. మరోసారి ఈ తప్పు పునరావృతం కానివ్వరాదని, ఎమ్మెల్సీల విషయంలో మర్యాదగా వ్యవహరించాలని చీఫ్ మార్షల్కు మండలి చైర్మన్ షరీఫ్ హెచ్చరిక జారీ చేశారు. వైసీపీకి చెందిన మంత్రులు అక్కడే ఉన్నప్పటికీ దీనిని అడ్డుకోలేకపోయారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీల వినతితో చైర్మన్ ఒక రూలింగ్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీలను అసెంబ్లీ భద్రతా సిబ్బంది ఆపరాదని, వారు తమ వెంట కాగితాలు వంటివి తెచ్చుకొంటున్నా స్వాధీనం చేసుకోవడం వంటివి చేయరాదని అందులో పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబుపై చర్య తీసుకోవాలని అక్కడ అధికార పక్షం చర్చ మొదలు పెట్టగానే... మండలిలో టీడీపీ పక్ష నేతలు మరో వాదన లేవనెత్తారు. ఛైర్మన్ రూలింగ్ ఇచ్చినా శుక్రవారం అసెంబ్లీ భద్రతా సిబ్బంది తమను అడ్డుకొని అవమానపర్చారని, దానిపై చర్యలు తీసుకోవాలని వారు పట్టుబట్టారు.
రెండు పార్టీలు వీడియోల్లో ఏది నిజం..
ఇక, మార్షల్స్ తో వివాదం సమయంలో చంద్రబాబు అధికారులను దూషించారని వైసీపీ..కాదు తాను ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా ఆ మాట అనలేదని టీడీపీ అధినేత మరో వీడియో మీడియా సమావేశంలో ప్రదర్శించారు. దీంతో..అసలు ఏ వీడియో నిజం అనే చర్చ మొదలైంది. ఇదే అంశం పైన మండలి రెండు మూడుసార్లు వాయిదా పడింది. ఆ తర్వాత చైర్మన్ చాంబర్లో వైసీపీ మంత్రులు, టీడీపీ పక్ష నేతల మధ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలు భద్రతా సిబ్బందితో అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఆ వీడియోలు మండలిలో ప్రదర్శిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాము కూడా తమ వద్ద ఉన్న వీడియోలు ప్రదర్శిస్తామని టీడీపీ ఎమ్మెల్సీలు చెప్పారు. దీనిపై కొంతసేపు వాదన జరిగింది. మధ్యే మార్గంగా అసెంబ్లీ తరఫున ఏర్పాటు చేసిన కెమెరాల్లోని ఫుటేజీని ప్రదర్శించాలని టీడీపీ ఎమ్మెల్సీలు గట్టిగా పట్టుబట్టారు. దానిని తెప్పిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కానీ, అది రాలేదు. దీనితో ఎటూ తేలకుండానే మండలి వాయిదా పడింది. ఇక, ప్రభుత్వం ఈ వ్యవహారంలో నిర్ణయాధికారం స్పీకర్ కు ఇవ్వటంతో .. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.