చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు.. ఎలుగుబంటి పాలన.. వైసీపీ నేతల సెటైర్లు..!
అమరావతి : వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. ఢీ అంటే ఢీ అనేలా ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తూ ఏపీ రాజకీయం హీటెక్కిస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేస్తూ మరో అడుగు ముందుకేస్తున్నారు కొందరు వైసీపీ నేతలు. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడిపై ఈ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.

చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు.. రక్తం పీల్చే జలగ : అంబటి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆశా వర్కర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. అబద్దాలు ప్రచారం చేయాలని చూసే చంద్రబాబు ఆటలు ఇకపై సాగవని చెప్పుకొచ్చారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని ఆయన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పలేదన్నారు. ఆయన అబద్దపు ప్రచారాల వల్లే ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆ క్రమంలో మరో అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు పాలిచ్చే ఆవు కాదంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు ఆయన రక్తం పీల్చే జలగ అంటూ ఫైరయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ మంత్రి ఒకరు ఇదివరకు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడిలా మాట్లాడితే తమ దేశంలో మెంటల్ ఆసుపత్రిలో చేరుస్తారని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఎద్దేవా చేశారు అంబటి.

జగన్ను మెచ్చుకోకున్నా సరే.. బురద మాత్రం చల్లొద్దు..!
సీఎం వైఎస్ జగన్ పాలనను మెచ్చుకోకున్నా పర్వాలేదు గానీ.. వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయొద్దని చంద్రబాబు నాయుడికి సూచించారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ లేకుండా చేస్తానని.. 23 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని ఫ్యాన్ గుర్తు లేకుండా చేస్తానని చంద్రబాబు నాయుడు హెచ్చరించిన తీరును ఎవరూ మరిచిపోలేదన్నారు. ఆ క్రమంలో జగన్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లారని చెప్పుకొచ్చారు.
2011లో వైసీపీ ఆవిర్భావం మొదలు ఎన్నో ఒడిదొడుకులు చవిచూసిందన్నారు. అయినా కూడా జగన్ సహనంతో అన్నీ ఓర్చుకున్నారని.. మధ్యలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చిపోయినా వైసీపీ మాత్రం వెనుదిరిగి చూడలేదన్నారు. దానికి కారణం ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

బాబుది ఎలుగుబంటి పాలన.. జగన్ది కామధేనువు పాలన : బత్తుల
మూడు రోజుల కిందట చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి. గత ఐదు సంవత్సరాల పాలనలో ఆయన ఏం ఉద్ధరించారని ప్రశ్నించారు. రాజకీయాలను కూడా వ్యాపారంగా మార్చేసిన చంద్రబాబు.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇవాళ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించిన బత్తుల.. నీరు - చెట్టు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఫైరయ్యారు.
ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎలుగుబంటి పాలన చేస్తే.. వైఎస్ జగన్ కామధేనువు పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు బత్తుల. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నదంతా దోచుకుని.. ఇప్పుడేమో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తన కల అంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
రాజధాని పేరుతో రైతుల భూములను బలవంతంగా గుంజుకుని తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆ భూములను తన కోటరీలోని నేతలకు అప్పనంగా పంచిపెట్టి అన్నదాతలను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications