ఆ కేంద్ర మంత్రిపై టీడీపీ ఒత్తిడి: సీఎం జగన్ కు వ్యతిరేకంగా: నేరుగా అక్కడే తేల్చేలా..!
ఏపీలో పీపీఏల రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోసారి కేంద్ర మంత్రి నుండి ఏపీ సీఎం కు ఇదే అంశం పైన లేఖ అందింది. జగన్ మాత్రం తన పట్టు వీడటం లేదు. లేఖ వచ్చిన తరువాత సైతం జగన్ అదే అంశాన్ని ప్రస్తావించారు. విద్యుత్ సంస్థలు 20 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని.. వీటిని కాపాడుకోవాలంటే సమీక్ష తప్పదని తేల్చి చెప్పారు. అదే సమయంలో విద్యుత్ ధరల కారణంగా పారిశ్రామిక వేత్తలకు ముందుకు రావటం లేదని బ్యాంకర్ల సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే..వైసీపీ నేతలు కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. పదే పదే ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాస్తూ.. అసలు అవినీతి జరగలేదని కేంద్ర మంత్రి సింగ్ సర్టిఫై చేయటాన్ని వైసీపీ నేతలు తప్పు బడుతున్నారు. ఆయన మీద తాజాగా టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలతో టీడీపీ అధినాయకత్వం ఆ మంత్రి మీద ఒత్తిడి తెస్తోందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ విషయాన్ని నేరుగా ప్రధాని వద్దే తేల్చుకోవాలని భావిస్తోంది.
టీడీపీ ఒత్తిడి తీసుకొస్తోంది..
ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష అమలు కాకుండా కేంద్రం నుండి ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కేంద్ర మంత్రి సింగ్ రెండు సార్లు ఏపీ ముఖ్యమంత్రికి లేఖలు రాసారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ తిరుమల పర్యటనకు వచ్చిన సమయంలో పీపీఏల విషయాన్ని ..అవినీతి గురించి వివరించారు. దీనికి ప్రధాని సైతం అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించనట్లు సమాచారం. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి సమీక్ష విషయంలో ముందుకు వెళ్లాలని భావించారు. అయితే, విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లాయి.

దీంతో పాటుగా కేంద్ర మంత్రి సింగ్ హైదరాబాద్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని తప్పు బడుతూ వ్యాఖ్యలు చేసారు. అసలు పీపీఏల్లో అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవని తేల్చేసారు. ఇక, రెండు రోజుల క్రితం ఆయన ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాసారు. అందులో ప్రధానికి గతంలో జగన్ రాసిన లేఖకు సమాధానంగా పేర్కొన్నారు. పీపీఏల సమీక్ష ద్వారా అంతర్జాతీయంగా పెట్టుబడి దారుల్లో అపనమ్మకం వస్తుందని..ఇది మొత్తంగా నష్టం చేస్తుందని పేర్కొన్నారు. ఈ లేఖ అందిన తరువాత జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. పీపీఏల సమీక్ష చేయకపోతే విద్యుత్ సంస్థల మనుగడ కష్టమని తేల్చి చెప్పారు. అదే విధంగా పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ..మరింత పెంచలేమని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జగన్ ఈ విషయంలో ముందుకే వెళ్లాలని భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.
ఢిల్లీలోనే తేల్చుకొనేలా వ్యూహం..
పీపీఏల విషయంలో ఇప్పుడు వెనకడుగు వేసే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి మీడియా సమావేశంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతల ద్వారా కేంద్ర మంత్రి పైన ఒత్తిడి తెచ్చి లేఖలు రాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము నేరుగా ప్రధానికి పరిస్థితిని వివరించటం..పూర్తి ఆధారాలతో ప్రధానికి లేఖ ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిని పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని అది ఇంధన శాఖకు ప్రధాని ఎండార్స్ చేసారు. కోర్టులో ఉన్న వ్యవహారాన్ని న్యాయ పరంగా ఎదుర్కొంటూనే..కేంద్ర ప్రభుత్వం వద్దే ఈ విషయంలో జరిగిన వాస్తవాలను వివరించాలని భావిస్తున్నారు.
అందు కోసం అమెరికా పర్యటన నుండి వచ్చిన తరువాత ప్రధాని మోదీతో పాటుగా హోం మంత్రి అమిత్ షా ను కలిసి దీని పైన చర్చించాలని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి ఈ రకంగా లేఖలు రాయటం.. ఓపెన్ గా వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం పైన వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. అయితే..సున్నితమైన అంశం కావటంతో దీనిని కేంద్ర స్థాయిలో జాగ్రత్తగా డీల్ చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications