చంద్రబాబుకు చావోరేవో - వైసీపీ నేతల అప్రమత్తం : రెండు పార్టీలకు "పిక్చర్" క్లియర్..!!
రానున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిది. వైసీపీ వర్సస్ టీడీపీ పోరులో పైకి రెండు పార్టీలు ధీమాగా కనిపిస్తున్నా...లోలోపల మాత్రం ఆ నమ్మకం కనిపించటం లేదు. సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సర్వేల ద్వారా క్షేత్ర స్థాయి వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇద్దరికీ తమ వ్యూహాల పైన నమ్మకం ఉన్నా.. ప్రత్యర్ధుల ఎత్తుల పైన అప్రమత్తం అవుతున్నారు. పార్టీ మహానాడు ద్వారా ఇక తమకు తిరుగు లేదనే విధంగా టీడీపీ కేడర్ లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చింది.
కానీ, ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకుండా వైసీపీని ఓడించేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సీఎం జగన్ తన సంక్షేమ పథకాల పైనే పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. ఇదే సమయంలో.. వైసీపీ నియోజకవర్గ ప్లీనరీల్లో పార్టీ ముఖ్య నేతలు తమ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఎత్తులు - వైసీపీ అప్రమత్తం
పార్టీ ముఖ్య నేత సజ్జల తాజాగా ఎన్టీఆర్ జిల్లా ప్లనరీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు చావో రేవే అన్నట్లుగా రంగంలోకి దిగుతారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అన్ని రకాల శక్తులను ఏకం చేసుకొని ఎన్నికలకు వస్తారంటూ పార్టీ శ్రేణులను అలర్ట్ చేసారు.
జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు అనేక కుట్రలు చేస్తారని.. వాటిని ఛేదించాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్లీ ప్లీనరీ సమావేశాల వేదికగా సీనియర్ నేత సీ రామచంద్రయ్య సైతం ఇదే రకంగా వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని. .చంద్రబాబును ఎదుర్కోవటంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జగన్ పూర్తి ధీమా - సీనియర్లు సూచనలు
సీనియర్ పొలిటీషియన్ మేకపాటి రాజమోహన్ రెడ్డి చిన్ని చిన్న పొరపాట్లు జగన్ చేస్తున్నారని వాటిని సరి దిద్దుకోవాలని సూచించారు. అయితే, రెండు పార్టీల అధినేతలకు మాత్రం క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన పూర్తి అవగాహన ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ లేనతంగా అందిస్తున్న సంక్షేమం - లబ్ది దారులు - అన్ని సామాజిక వర్గాలకు దగ్గరయ్యేలా అమలు చేస్తున్న సామాజిక న్యాయం తనకు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో ఉద్యోగులు..యువత..కొన్ని వర్గాల్లో జగన్ పాలన పైన ఉన్న అభిప్రాయాల పైన ఆరా తీస్తున్నారు. అందరినీ దగ్గర చేసుకొనేందుకు కొత్త వ్యూహాలను సిద్దం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ వేదికగా కీలక అంశాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక, అటు చంద్రబాబు సైతం జాగ్రత్త పడుతున్నారు. జగన్ వచ్చే ఎన్నికలను ఏ మాత్రం ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చేలా వ్యవహరించరనే విషయం గ్రహించారు.
జగన్ ను ఢీ కొట్టాలంటే - టీడీపీ చీఫ్ వ్యూహాలు
అందులో భాగంగా.. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమం - సోషల్ ఇంజనీరింగ్ కు ధీటుగా ప్రణాళికలతో వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించి..దాని పైన కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో సహజంగా ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకత.. జగన్ నిర్ణయాల కారణంగా కొంత ఏర్పడని ప్రతికూల పరిస్థితులను ఓటుగా మలచుకొనే క్రమంలో..ఆ ఓటు చీలకుండా పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా జనసేన - బీజేపీతో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ గ్రౌండ్ రియాల్టీ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. క్షేత్ర స్థాయి నివేదికల ఆధారంగా రెండు పార్టీలు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి.