వైసీపీ నేతలకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి:మంత్రి నక్కా
గుంటూరు:కోడి కత్తి విషయమేదో పెద్ద జాతీయ సమస్య లాగా వైసీపీ నేతలు అర్జంటుగా వెళ్లి రాష్ట్రపతిని కలిశారని...వారి నాటకాలకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చని మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు.
బుధవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నాయకులపై విమర్శల వర్షం కురిపించారు. కోడి కత్తి సంఘటన జరిగి ఇన్ని రోజులైనా జగన్ నోరు మెదపడం లేదెందుకని మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు. వ్యవస్థలపై నమ్మకం లేదని బాహాటంగా నిస్సిగ్గుగా చెప్పే వ్యక్తి ప్రతిపక్ష నేతగా అనర్హుడని మంత్రి నక్కా ఆనందబాబు తేల్చేశారు.
ఆయన రక్తం పారిస్తే...బాబు నీళ్లు పారించారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం రాయలసీమలో రక్తం పారిస్తే...తమ పార్టీ అధినేత చంద్రబాబు అక్కడ నీళ్లు పారిస్తున్నారని మంత్రి నక్కా ఆనంద్బాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీపై విపక్ష నేతలు జగన్, పవన్ పల్లెత్తి మాట అనడం లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు.
పార్టీలను...ఏకం చేసిన చంద్రబాబు
బీజేపీ మతతత్వ పార్టీ కాదని పవన్ కళ్యాణ్ చెప్పడం సిగ్గుచేటు అని మంత్రి నక్కా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అంటూ నానా కాకి గోల చేసిన బిజెపి ఎంపి జీవీఎల్ కేంద్రంపై కాగ్ నివేదికపై మాట్లాడాలని హితవు పలికారు. ఇక వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి కేంద్రానికి ఒక గూఢాచారి అని మంత్రి అభివర్ణించారు. దేశంలోని 15 పార్టీలను తమ పార్టీ అధినేత చంద్రబాబు ఏకం చేశారని, ఇదీ ఆయన ఘనత మంత్రి నక్కా ఆనందబాబు కొనియాడారు.
దోచుకున్న వాళ్లని...వదిలేది లేదు
పోలవరం ప్రాజెక్టులో నాణ్యత లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోవైపు కేంద్రం దోషి అంటూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో దోపిడీకి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.
బిజెపి...రిలే నిరాహార దీక్షలు
కాంగ్రెస్ను రకరకాలుగా విమర్శించిన చంద్రబాబు చివరకు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఓటమి భయం కారణంగానే ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అణగదొక్కుతున్నారని కన్నా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని, పోర్టులు, సెజ్ల పేరుతో ఇష్టారాజ్యంగా భూముల కేటాయింపును నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 24 వరకు రిలే నిరహార దీక్షలు చేయనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.