అచ్చెన్నాయుడు టార్గెట్ గా వైసీపీ మైండ్ గేమ్.. ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై టీడీపీ గరం గరం !!
అధికార వైసీపీ మరోమారు ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోందా? అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసు ఇచ్చి అచ్చెన్నను కమిటీ ముందు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం వెనక టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నను ఒత్తిడికి గురి చేసే వ్యూహం ఉందా? ఇప్పటికే వైసీపీ సర్కార్ పై అన్ని విషయాల్లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పోరాటం చేస్తున్న అచ్చెన్నాయుడుని టార్గెట్ చేస్తే ఆయన నోటికి తాళం వెయ్యొచ్చు అని భావిస్తున్నారా? అంటే టీడీపీ శ్రేణులు అవుననే అంటున్నాయి.
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎవరైనా బలంగా గళం వినిపిస్తే వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ఏదో ఒక వ్యవహారంలో ఇరికిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై సమాధానం చెప్పాలని నోటీసులు
ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాంను అగౌరవపరిచేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ్యుడు అచ్చెన్నాయుడికి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఈ ఫిర్యాదుపై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మొదటి సారి ఇచ్చిన వివరణ సరిగాలేదని, రెండవసారి వివరణ కోరగా ఆయన పట్టించుకోలేదని, దీంతో ఆయనను ఆగస్టు 10న జరగనున్న ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించామని సభా హక్కుల కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
నిన్న జరిగిన సభా హక్కుల కమిటీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం సిఫార్సు చేసిన తొమ్మిది నోటీసులపై చర్చించిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇక నిమ్మగడ్డ రమేష్ కి నోటీసులు పంపించినా కరోనా కారణంగా రాలేనని చెప్పారని దీనిపై తర్వాత సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

గతంలో ఆయన ఇచ్చిన వివరణ సరిగా లేదు.. మళ్ళీ అందుకే నోటీసులు
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అచ్చెన్నాయుడు పై చేసిన ఫిర్యాదుకు గతంలోనే సమాధానమిచ్చినా ఆ సమాధానం సంతృప్తికరంగా లేదని, ఫిర్యాదులోని అంశాలకు పూర్తిగా వివరణ ఇవ్వలేదని, నోటీసులకు ఆయన స్పందించలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగా హాజరై కమిటీ ముందు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు పై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారని, దానికి కూడా ఆయన వివరణ ఇవ్వలేదని, ఈ ఫిర్యాదుపై కూడా ఆయనకు రిమైండర్ పంపాలని కమిటీ సూచించింది.

అచ్చెన్నను ఇబ్బంది పెట్టటం కోసమే.. మైండ్ గేమ్ లో భాగంగా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
అయితే ఏదో ఒక రకంగా అచ్చెన్నాయుడుని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని మళ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకావాలని నోటీసులు పంపి మైండ్ గేమ్ ఆడుతున్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి మైండ్ గేమ్స్ కు భయపడేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్నాయుడుని నిందితుడిగా చేర్చి జైలుకు పంపి, ఆయనకు రెండు సార్లు ఆపరేషన్ జరగటానికి, ఆయన అనారోగ్యానికి కారణమయ్యారని , ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల సమయంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడు పై కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అచ్చెన్న ను అరెస్ట్ చేశారని ఏదో ఒక కుంతీ సాకు చూపి ఇబ్బంది పెడుతున్నారంటున్నారు.

జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్న అచ్చెన్నకు నోటీసులతో బ్రేక్
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేస్తున్నందుకు రోజుకో రకంగా వేధింపులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నారని,అందులో భాగంగానే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని పిలుస్తున్నారని టిడిపి నేతలు అంటున్నారు. ఇక ఇటీవల చూస్తే వైసీపీ ప్రభుత్వ విధానాలపై అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ సర్కారును నిలదీస్తున్నారు.
గట్టిగానే తన వాయిస్ వినిపిస్తున్నాడు. ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో మరోమారు ఆయన వాయిస్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు జగన్ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు .












Click it and Unblock the Notifications