ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ ఆ నిర్ణయంతో - 175 మందిలో ఒకే ఒక్కడుగా..!!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డితో తప్పని పరిస్థితుల్లో రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 82,888 ఓట్ల మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మేకపాటి గౌతమ్ మరణంతో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సంగం బ్యారేజీకి గౌతమ్ పేరు పెట్టారు. ఇప్పుడు ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్న విక్రమ్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయం పార్టీలకు అతీతంగా రాజకీయ చర్చకు కారణమవుతోంది.

నియోజకవర్గానికి రూ 10 కోట్ల సొంత నిధులు
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక వేత్తగా ఉంటూ..అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా.. తన సోదరుడు గౌతమ్ నియోజకవర్గం కోసం ఇచ్చిన హామీలను అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం తన సొంత నిధుల నుంచి రూ పది కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధితో ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు చేసారు. నెల్లూరు కేంద్రంగా ప్రముఖులను ఆహ్వానించి ఆత్మకూరు అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతగా రూ పది కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు.

రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం
రక్షణ శాఖ సలహాదారుగా ఉన్న సతీష్ రెడ్డితో సహా మరి కొందరు ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఆత్మకూరు అభివృద్ధికి ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాల పైన అన్ని రంగాల ప్రముఖులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు - ప్రజాప్రతినిధులు- నియెజకవర్గ ప్రముఖులతో కలిసి ఆత్మకూరు అభివృద్ధి కోసం ఒక ఫోరం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజవకర్గంలో ముందుగా మౌళిక వసతుల పెంపుతో పాటుగా విద్యా - ఉపాధి అవకాశాల కల్పన దిశగా చర్చలు చేసి..నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రకటన చేసారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు.

విక్రమ్ రెడ్డి నిర్ణయానికి ప్రశంసలు
ఇప్పుడు ఈ నిర్ణయం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమవుతోంది. ఎమ్మెల్యే సొంత నిధులతో నియోజకవర్గం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలకు స్థానికంగా ప్రశంసలు అందుతున్నాయి. తొలి నుంచి పారిశ్రామికవేత్తగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా నియోజకవర్గ అభివృద్ధి కి సంబంధించి పక్క ప్రణాళికతో ముందుకు వస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications