వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి:ఎట్టకేలకు ఎసిబి ముందుకు...!
విజయవాడ:ఓ డిఎస్పీ బినామీ ఆస్తుల కేసులో వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎసిబి ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో రెండు సార్లు అనారోగ్యం కారణంగా విచారణకు గైర్హాజరైన ఆర్కే సోమవారం ఉదయం ఎసిబి ముందుకు వచ్చారు.
గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబికి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్కి చెందిన అక్రమాస్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఎసిబి గుర్తించింది. దీనిపై విచారణకు రావాల్సిందిగా ఎసిబి ఆళ్లకు నోటీసులు జారీ చేసింది. కాగా ఆరోగ్యం బాగాలేదన కారణంతో రెండు సార్లు తన తరపున న్యాయవాదులను పంపిన ఎమ్మెల్యే మూడో సారి స్వయంగా ఎసిబి ముందు హాజరయ్యారు.
2017 జనవరి నెలలో ఒంగోలు పీటీసీ డీఎస్పీగా పనిచేస్తున్న దేవిశెట్టి దుర్గాప్రసాద్ కు సంబంధించిన 14 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏకకాలంలో గుంటూరు పట్టణంతో పాటు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా చీరాల, తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ సహా 14 ప్రాంతాల్లో డిఎస్పీ రెడ్డి రమాదేవి ఆధ్వర్యంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
ఆయా దాడు ల్లో పలు విలువైన ఆస్తుల తాలూకు పత్రాలు, నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ఇంకా లెక్కించనప్పటికీ.. సుమారు రూ.3కోట్ల వరకు ఉండొచ్చని, బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.50కోట్లకు పైనేనని ఎసిబి అధికారులు చెపుతున్నారు. ఈ క్రమంలో ఆ డిఎస్పీకు సంబంధించి దొరికిన పత్రాల్లో ఎమ్మెల్యే ఆర్కే భార్య పేరు మీద కూడా ఆస్తి పత్రాలు ఉన్నట్లు ఎసిబి పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ పత్రాల విషయమై విచారణకు ఆర్కేని ఎసిబి విచారిస్తోంది.
ఇదిలావుండగా తనపై కావాలనే రాజకీయ కుట్ర పన్నుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్ తనకు మిత్రుడని, దుర్గాప్రసాద్ నుంచి తాను పొలం కొన్న మాట వాస్తవమేనన్నారు. అయితే దుర్గాప్రసాద్ అవినీతితో తనకు సంబంధం లేదని, ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతానని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎసిబి విచారణకు హాజరై వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.