ఇన్ సైడర్ ట్రేడింగ్ ఫిర్యాదులు నిలుస్తాయా: చేయాల్సిందేంటంటే: ఎంపీ రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు ..!
అమరావతి రాజధాని పేరుతో అక్కడి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం నిర్ధారించింది. దీని పైన మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చింది. దీని పైన సీబీఐ లేదా లోకాయుక్తతో విచారణ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ రఘురామ రాజు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాను ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తానని చెబుతూనే..లా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానంటూ ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద మాట్లాడారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతిలో రాజధాని అనే విషయం పార్టీ నేతలకు చెప్పి..వారి ద్వారా తక్కువ ధరలకే రైతుల నుండి భూములు సేకరించారని..దాదాపు 4070 ఎకరాల మేర ఇలా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది సబ్ కమిటీ తేల్చిన విషయం. అందులో టీడీపీ ప్రముఖులు ఉన్నారని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి.
బాంబు పేల్చిన జగన్ సర్కార్.. అమరావతి భూకొనుగోళ్లపై సంచలన రిపోర్టు.. బాబు, లోకేశ్
ఇన్ సైడర్ ట్రేడింగ్ ఫిర్యాదులు నిలుస్తాయా..
ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సబ్ కమిటీ తేల్చటంతో ఈ వ్యవహారం పైన సీబీఐ లేదా లోకాయుక్తకు విచారణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. దీని పైన న్యాయ నిపుణుల సూచనల మేరకు అప్పగిద్దామంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. అయితే, ఇదే అంశం పైన ఒక టీవీ చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని భూముల విషయంలో అవినీతి జరిగిందనే విషయాన్ని చెబుతూనే..అయితే అది ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద విచారణ చేస్తే ..నిరూపణ కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేసారు. లా తెలిసిన వ్యక్తిగా తాను ఈ అభిప్రాయం చెబుతున్నానని.. సీఎం ఆ అంశం మీద విచారణ జరపాల్సిందేనంటూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తానని తేల్చి చెప్పారు.
వారి పైన ప్రయోగించాల్సిన చట్టం ఇదీ...
అదే సమయంలో ఎంపీ రఘురామ రాజు ప్రభుత్వానికి ఒక సూచన చేసారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఫిర్యాదు కాకుండా..అక్రమ పద్దతిలో తమ బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేసిన వారి పైన కేంద్రం తాజాగా తీసుకొచ్చిన బినామీ చట్టం ప్రయోగించాలని సూచించారు. దీని ద్వారా మాజీ మంత్రులు..టీడీపీ ప్రముఖులు ఎవరైతే తమ వద్ద ఉండే వారి పేర్లతో ..తమకు బినామీలుగా ఉంచి భూములు కొనుగోలు చేసారో వారి పైన చర్యలకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. ఇదే విషయాన్ని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి వివరిస్తానని స్పష్టం చేసారు. అయితే, కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే..చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని..హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. అవసరమైతే బినామీ చట్టం ప్రయోగించాలని చంద్రబాబు సూచించారు. ఇప్పుడు అధికార పార్టీ ఎంపీ సైతం అదే విషయాన్ని చెబుతున్నారు.
విచారణ ఖాయమంటున్న ప్రభుత్వం..
ఇక, ఇదే అంశం మీద కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. అమరావతిలో భూముల స్కాం పైన కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సారాంశాన్ని మంత్రి బుగ్గన సహచర మంత్రులకు వివరించారు. దీని పైన సీబీఐ విచారణ చేయించాలని పలువురు మంత్రులు సూచించారు. అయితే, సీబీఐ విచారణకు ఇస్తే రాజకీయ వేధింపులుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుందని..లోకాయుక్తకు ఇవ్వాలని మరి కొందరు మంత్రులు సూచన చేసారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని దీని పైన న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్న తరువాత ఏ విచారణకు ఇవ్వాలనే అంశం పైన నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో విచారణ చేయిస్తారా..లేక బినామీ చట్టం కింద కేసు నమోదు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.