సాయిరెడ్డికి ఆ బాధ్యతల తొలిగింపు..!! సీఎం జగన్ కీలక నిర్ణయం : పార్టీలో ముఖ్యనేతల పదవులు ఛేంజ్..!!
ముఖ్యమంత్రి జగన్ అటు పాలనా పరంగా..ఇటు పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసారు. అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తవుతున్న వేళ జగన్ పలు పార్టీ - ప్రభుత్వంలో పూర్తి స్థాయి ప్రక్షాళనకు సిద్దం అవుతున్నారు. తన కేబినెట్ లో అందరు మంత్రులను తప్పించి..కొత్త వారిని తీసుకోవాలని జగన్ ఇప్పటికే నిర్ణయించారు. సీనియర్లు - జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించాలనే నిర్ణయానికి ప్రస్తుత మంత్రులు సైతం మానసికంగా సిద్దమైపోయారు.
పార్టీ ముఖ్యుల పదవుల్లో మార్పులు
ఇదే సమయంలో పార్టీలో జగన్ తరువాత కీలకంగా చెప్పుకొనే నేతలు ప్రస్తుతం నిర్వహిస్తున్న పార్టీ బాధ్యతల్లోనూ మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పార్టీలో విజయ సాయిరెడ్డి..సజ్జల..వైవీ సుబ్బారెడ్డి..వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి..మోపిదేవి సమనన్వయ కర్తలుగా 13 జిల్లాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రక్షాళనలో భాగంగా విజయసాయిరెడ్డి ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం.
సాయిరెడ్డికి బాధ్యతలు మార్పు తప్పదా
జగన్ మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ఖరారు చేసారు. అయితే, న్యాయ పరంగా కేసులతో ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. విజయ సాయిరెడ్డి 2019 ఎన్నికల సమయం నుంచి ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ..స్పెషల్ రైల్వో జోన్..స్థానిక సంస్థల ఎన్నికలు..గ్రేటర్ విశాఖ పోరులో పార్టీని ముందుండి నడిపించారు. అదే సమయంలో విశాఖలో వైసీపీ నేతల తీరు పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సాయిరెడ్డి సైతం తనకు సొంత ఇల్లు కూడా లేదని..హైదరాబాద్ లో అద్దెకు ఉంటున్నానని చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్ర బాధ్యతలు మరో నేతకు దక్కనున్నాయా
తనకు భీమిలిలో ఇల్లు తీసుకొని నివాసం ఏర్పాటు చేసుకోవాలనే కోరిక ఉందని వెల్లడించారు. నిరంతరం విశాఖ వ్యవహారాల్లో యాక్టివ్ గా ఉండే సాయి రెడ్డి కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఇక, జగన్ పార్టీ ఇన్ ఛార్జ్ ల బాధ్యతల విషయంలోనూ మార్పులు చేర్పులకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా విజయ సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి ..కొత్తగా ఆ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండటంతో పాటుగా ఏపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
సాయిరెడ్డికి జగన్ బాధ్యతలు మార్పు వెనుక
కేంద్రం - రాష్ట్రం మధ్య సమన్వయకర్తగా పని చేస్తున్నారు. సాయిరెడ్డిని పూర్తిగా కేంద్ర వ్యవహారాల పర్యవేక్షణకు పరిమితం చేయాలని... కేంద్రం నుంచి పోలవరం తో పాటుగా ఆర్దిక అంశాల పైన సమన్వయం కోసం వినియోగించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా.. సీఎస్ గా పదవీ విరమణ చేసిన ఆదిత్యనాధ్ దాస్ ను సీఎం జగన్ సలహాదారుగా నియమించి..కేంద్రంతో లైజనింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సాయిరెడ్డిని సైతం ఢిల్లీలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
జగన్ నిర్ణయాల పైన ఉత్కంఠ
అదే విధంగా ఇక, ప్రస్తుతం సీనియర్ మంత్రులుగా ఉన్న వారిని కేబినెట్ నుంచి తప్పించి వారికి జిల్లాలను కేటాయించనున్నారు. జిల్లాల బాధ్యులు..సమన్వయకర్తల తో కలిపి 2024 ఎన్నికల టీం ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సీనియర్లకు ఇన్ ఛార్జ్ పదవులు... నేతల సమన్వయం.. జిల్లాల్లో పార్టీ - ప్రభుత్వ మధ్య కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు. కేబినెట్ తో పాటుగానే పార్టీలోనూ కీలక మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..పార్టీలో ఎవరికి కీలక పదవులు దక్కుతాయి.. ఎవరి విషయంలో జగన్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.