జగన్ పై అలిగారా..అసంతృప్తా: వైసీపీ సీనియర్లకు ఏమైంది..నెల రోజుల్లోనే : టీడీపీ ఎటాక్ చేస్తున్నా..
వైసీసీ సీనియర్లకు ఏమైంది. మంత్రి పదువులు ఇవ్వలేదని అలకా. అధికారంలో వచ్చేసాం కదా అనే నిర్లక్ష్యమా. మరి మంత్రులుగా పదవుల్లో ఉన్న వారు సైతం అంతేనా. ప్రతిపక్షం ప్రభుత్వం పైనా ఆరోపణలు ఎక్కుపెడుతున్నా.. ఏకం గా ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నా ఏ ఒక్కరూ స్పందించటం లేదు. లోకేశ్ రోజూ ట్వీట్ల ద్వారా జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు పరామర్శ యాత్రలో ప్రభుత్వ వైఫల్యం అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా..పార్టీ - ప్రబుత్వంలో సీనియర్లు ఇప్పటి వరకు సరిగ్గా స్పందించిన దాఖలాలు లేవు. నెల రోజుల పాలనలోనే ఈ రకంగా వ్యవహరిస్తే..ఇక భవిష్యత్ ఏంటనే ప్రశ్న కార్యకర్తల నుండి ఎదురవుతోంది..
Recommended Video
టీడీపీ విమర్శలు గుప్పిస్తున్నా..
వైసీపీలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మార్పు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో..శాసనసభలో ఒకటిగా వ్యవహరించిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం ఉదాసీనంగా కనిపిస్తున్నారు. టీడీపీ నేతలు వరుసగా సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తాజాగా పరామర్శ యాత్ర పేరుతో ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతీ సందర్భంలోనూ ఆరోపిస్తున్నారు. విద్యుత్ కోతలు...విత్తనాల కొరత గురించి ప్రస్తావిస్తు న్నారు. ఇక, లోకేశ్ ప్రతీ రోజు ట్వీట్ల ద్వారా జగన్ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. జగన్ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఇక, టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు లాంటి వారు ప్రభుత్వ విధానాల పైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయ సాయిరెడ్డి జీవో వ్యవహారం పైనా యనమల ఏకంగా విజయ సాయిరెడ్డి పైన అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేస్తామని చెప్పినా పార్టీ..ప్రభుత్వం నుండి ఏ ఒక్కరూ స్పందించలేదు. లోకేశ్ ట్వీట్లు..చంద్రబాబు వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి మాత్రమే సమాధానం చెబుతున్నారు.
సీనియర్ల మౌనవ్రతం...ఎందుకిలా
ఎన్నికల్లో గెలిచే వరకూ వైసీపీలో సీనియర్లు యాక్టివ్ గానే ఉన్నారు. కేబినెట్ రూపకల్పన జరిగిన తరువాతనే వీరిలో మార్పు కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న అంబటి రాంబాబు, భూమన కరుణాకరరరెడ్డి, పార్ధసారధి, రోజా, ధర్మాన ప్రసాద రావు, కారుమూరి నాగేశ్వర రావు లాంటి వారు నిత్యం వైసీపీ వాయిస్ వినిపించటంలో ముందు వరుస లో ఉండేవారు. కారణాలు ఏవైనా వారు కొద్ది రోజులుగా మౌనం పాటిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఇదే నేతలు గట్టిగా పార్టీ గళాన్ని వినిపించారు. మంత్రి పదవులు పొందిన వారే బాధ్యత తీసుకోవాలని వారు భావిస్తున్నా రా అనే చర్చ జరుగుతోంది. అయితే, మంత్రుల్లోని సీనియర్లలో బొత్సా, కన్నబాబు, బుగ్గన మినహా మిగిలిన వారు సైతం ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం చెప్పలేక పోతున్నారు. సీనియర్లు అయిన మోపిదేవి..విశ్వరూప్..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. బాలినేని శ్రీనివాస రెడ్డి..పిల్లి సుభాష్ చంద్రబోస్ వారి శాఖల నిర్వహణకే పరిమితం అయ్యారు. పదే పదే ప్రతిపక్షాలు శాంతి భద్రతల అంశం గురించి మాట్లాడుతుంటే వాస్తవం ఏం జరిగిందనే వివరణ ఇప్పటి వరకూ ప్రభుత్వం నుండి రాలేదు.
ముఖ్యమంత్రి సైతం స్పందించటం లేదు..
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటి వరకు జగన్ ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. ఇక, ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు సైతం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావటం లేదు. ఇక, ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణలకు ముఖ్యమంత్రి నేరుగా స్పందించకపోయినా..ఆయన పేరుతో ప్రకటనలు సైతం ఇవ్వటం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ట్వీట్ల ద్వారా జగన్ ప్రతీ అంశం మీద స్పందించేవారు. ఇప్పుడు ట్వీట్లు కూడా చేయటం లేదు. శాసనసభా సమావేశాల్లోనే అన్నింటికి సమాధానం చెప్పాలనే ఆలోచనలో ముఖ్యమం త్రి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు జోరుగా ఉన్న సమయంలో సీనియర్లు బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం వైసీపీ నేతల మధ్య ప్రముఖంగా చర్చ జరుగుతోంది.