తెరాసలోకి ఇల్లందు ఎమ్మెల్యే కోరం! గవర్నర్తో కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి విపక్షాలన్నింటికి షాకిచ్చేలా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి పలువురు ప్రజాప్రతినిధులు కారు ఎక్కేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కాంగ్రెసు పార్టీ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఆయన తెరాసలో చేరేందుకే కలిసినట్లుగా చెబుతున్నారు.
గవర్నర్ నరసింహన్తో కేసీఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాజ్భవన్లో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,ఉద్యోగుల విభజనపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్తో భేటీ అయ్యారు.
మెదక్ ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు : లక్ష్మణ్
విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలకంటే మెదక్ ఉప ఎన్నికే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమైపోయిందని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంట్ సంక్షోభం తీవ్రంగా ఉందన్నారు. ఓ వైపు పంటలు ఎండిపోతుంటే ఎప్పుడో చత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చి ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. మెదక్ జిల్లాలోనే రైతలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులకు పరామర్శించే తీరక లేకుండా పోయిందన్నారు.