రోజా సస్పెన్షన్: పద్ధతి ఇది కాదన్న స్పీకర్, జగన్వి స్థిరత్వం లేని ఆలోచనలన్న అచ్చెన్నాయుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ అంశంపై ఈరోజు ఉదయం అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కల్పించుకున్నారు.
రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయమని వైసీపీ కోరుతున్న పద్ధతి సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "తప్పు జరిగింది, మరోసారి ఇలా జరగనివ్వబోము. సస్పెన్షన్ ఎత్తివేయండని కోరితే పరిస్థితి మరోలా ఉండేది. అలా చేయకుండా, సభ తప్పు చేసింది. తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించడం సరికాదు" అని అన్నారు.
సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసే హక్కు సభాపతికి లేదని ఎలా చెబుతారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరోవైపు సభా వ్యవహారాల మంత్రి యనమల కలగజేసుకుని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

వైసీపీ సభ్యురాలైన రోజా వ్యాఖ్యలు సభను కించపరేచేలా ఉన్నాయని ఆయన తెలిపారు. రోజా సస్పెన్షన్ విరుద్ధమంటూ జగన్ మాట్లాడటం సరికాదన్నారు. కాల్మనీ వ్యవహారంపై శనివారం మాట్లాడారని మళ్లీ అదే అంశంపై మాట్లాడతామని కోరడం ఎంత వరకు సమంజసమన్నారు.
సభా సమాయాన్ని వృధా చేసేందుకు ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరైందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్వి స్థిరత్వం లేని ఆలోచనలు, నిర్ణయాలతోనే సభను అడ్డుకుంటున్నారు. కాగా, ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే సమావేశాల్లో భాగంగా రోజాపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని ప్రతిపక్ష నేత జగన్ స్పీకర్ను కోరారు.
అయితే ఇందుకు అధికార పక్షం ససేమిరా అనడంతో వైసీపీ ఏకంగా శీతాకాల సమావేశాలనే బహిష్కరించింది. రోజా సస్పెన్షన్ పై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ తర్వాత జగన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications