వుడా పార్క్లో కలకలం: ప్రియురాలిపై బ్లేడుతో దాడి, యువకుడి ఆత్మహత్యాయత్నం
అనుమానంతో ప్రియురాలిపై దాడి చేసి, ఆపై ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నం: జిల్లాలోని పెదవాల్తేరు సమీపంలోని వుడా పార్కులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో ప్రియురాలిపై దాడి చేసి, ఆపై ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మూడో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. నాగలక్ష్మణరావు, కె రమ్య గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇద్దరు వుడా పార్కులో కలుసుకున్నారు.
రమ్య వేరొకరి ద్విచక్రవాహనంపై వెళ్లిందని ఆరోపిస్తూ లక్ష్మణరావు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు ప్రియురాలి గొంతుపై బ్లేడుతో దాడి చేశాడు. దీంతో గొంతుకు తీవ్రగాయమైంది.
కాగా, అనంతరం తన గొంతును సైతం బ్లేడుతో కోసుకున్నాడు లక్ష్మణరావు. వారిద్దరిని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి.. చికిత్సనిమిత్తం కేజీహెచ్కు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.