ఫ్యాన్సీ పేరుతో 4గురు ఎమ్మెల్యేలకు హై'టెక్' మోసం
ఒంగోలు: మీకి ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ కావాలా అంటూ ప్రజాప్రతినిధులు, ఫ్యాపారవేత్తలు లక్ష్యంగా పలువురిని మోసం చేసిన హైటెక్ మాయగాడిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని ఐదుగురు ప్రజా ప్రతినిధులు, ఇద్దరు పారిశ్రామికవేత్తలకు ఫ్యాన్సీ సెల్ఫోన్ నెంబర్లు ఇస్తానని అతను వారిని మోసం చేశాడు. నిందితుడు దీపుబాబును చీరాల పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.
శనివారం ఎస్పీ మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ (23)ను అరెస్టు చేశామని, అతని నుండి విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్ట్యాప్, సెల్ఫోన్లు, వాహనాలు స్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
హోల్డ్ చేయించిన నిందితుడి బ్యాంకు ఖాతా నుండి ఐదు లక్షల 37 వేల రూపాయలతో కలిసి మొత్తం 12 లక్షల 22 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై డీఎస్పీపర్యవేక్షణలో ఐదుగురు పోలీసు అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుంటూరు బస్టాండ్ ఎదురుగా నిందితుడ్ని అరెస్టు చేశారు.
నిందితుడి తండ్రి కోర్టు ఉద్యోగి, తల్లి ప్రభుత్వ హాస్పటల్లో పని చేస్తున్నారు. బీటెక్లో చేరి మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి రాజకీయ నాయకులతో, సినీ హీరోలతో, స్టోర్డ్స్ స్టార్స్తో ఫోటోలు తీయించుకొని వాటిని కార్పొరేట్ కాలేజీల్లో చూపించి తన అవిటితనాన్ని చూపించి డబ్బులు వసూలు చేసి జల్సాలకు వాడుకునే వాడని పోలీసులు తెలిపారు.
ప్యాన్సీ ఫోన్ నెంబర్లు ఇస్తానని చెప్పి తన ఫోన్ నుండి వారికి మెసేజ్ చేసి వారి ద్వారా నిందితుని స్నేహితుడు చల్లగుండ సురేష్ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయించుకునేవాడు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్కు సంబంధించిన ఖాతాల నుండి తొమ్మిది లక్షలకు పైగా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఖాతా నుండి నాలుగు లక్షలకు పైగా అకౌంటులో వేయించుకున్నాడు.
అలాగే, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి పిఏకు సంబంధించిన ఖాతాల నుండి దాదాపు పదిహేను వేల రూపాయలు, పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఖాతా నుండి అరవై నాలుగు వేల రూపాయల వరకు, గోపాలపురం ఎమ్మెల్యేకు సంబంధించిన నలభై ఎనిమిది వేలకు పైగా, ఏలూరు మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన 24 వేల రూపాయలు వేయించుకున్నట్లు తెలిపారు. పైడి గ్రూప్ ఆఫ్ కంపెనీకు సంబంధించిన 2 లక్షల 22 వేల రూపాయలు, ప్రగతి గ్రూప్ ఆఫ్ కంపెనీకు సంబంధించి 48 వేలు తన ఖాతాలో వేయించుకున్నట్లు ఎస్పీ వివరించారు.