కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడ్ని ముక్కలుగా నరికాడు
అనంతపురం: తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి ఓ యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతపురంలో జరిగిన ఈ సంఘఠన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని తండ్రి ప్రేమించిన యువకుడిని తన తోటకు పిలిపించి, కత్తులతో నరికి ముక్కలు ముక్కలుగా చేసి కాళ్లు, చేతులు, తలను బావిలో పడేసి మొండాన్ని అనంతపురం పట్టంలోని రవి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న కాలువలో పడేశాడు.
కాలువలో మొండాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన బయటకు వచ్చింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముత్తాల గ్రామానికి చెందిన షబ్బీర్ పాష (21) గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. అదే గ్రామానికి చెందిన యువతిని అతను ప్రేమించాడు. విషయం తెలుసుకున్న తండ్రి చంద్రశేఖర్ రెడ్డి షబ్బీర్ను చంపాలని పథకరచన చేశాడు.
పథకం ప్రకారం ఈనెల 4వ తేదీ తెల్లవారుజామున గొర్రెలకు మందు వేయాల్సి ఉందని షబ్బీర్ను తన తోటకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన తర్వాత కత్తితో అతన్ని దారుణంగా హతమార్చాడు. నాలుగు రోజుల నుంచి కుమారుడు కనిపించకపోవడంతో షబ్బీర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం మురికి కాలువలో మొండెం ఉందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు షబ్బీర్ తల్లిదండ్రులకు విషయం తెలిపారు. శరీరంపై గుర్తుల ఆధారంగా షబ్బీర్దిగా గుర్తించారు.
కాగా, అదే రోజు నుంచి యువతి, చంద్రశేఖర రెడ్డి కూడా కనిపించడం లేదు. దీంతో అతని భార్యను, కూతురును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.