రాజకీయాల కోసం దేవుడ్నీ వదలరా ? మతాలపై వివక్ష చూపట్లేదు- జగన్ కామెంట్స్
ఏపీ దేవాలయాల్లో తాజాగా విగ్రహాల ధ్వంసంతో పాటు ఇతర ఘటనల విషయంలో విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. దేవుడ్ని కాపాడలేని ముఖ్యమంత్రి తప్పుకోవాలంటూ విపక్ష నేత చంద్రబాబు మొన్న రామతీర్ధంలో డిమాండ్ చేశారు. విపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల దాడిపై సీఎం జగన్ ఇవాళ స్పందించారు. విపక్షాలు తమ స్వార్ధ రాజకీయాల్లోకి దేవుళ్లను కూడా లాగుతున్నాయంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ప్రజలపై ఎలాంటి వివక్షా చూపలేదన్నారు. అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనన్నారు.
Recommended Video

ఆలయాల ఘటనల్ని ఉపేక్షించబోమన్న జగన్
ఇవాళ పోలీసు డ్యూటీ మీట్ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపైనా స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో తాము ప్రజలపై ఎలాంటి వివక్షా చూపలేదన్నారు. అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని.. పార్టీలు, కులాలు, మతాలు చూడాల్సిన అవసరం తమకు లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. మంచి పాలన చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారన్నారు. నేరాలు చేసే వారి మనస్తత్వాలు పూర్తిగా మారిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఉద్రిక్తలు, విష ప్రచారాలతో ఎవరికి లాభం..
రాష్ట్రంలో ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వసాలు దెబ్బతీసే విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఎవరిని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గాలు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలి. ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సమాజంలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోయాయి. యుగం మారింది.. కలియుగంలో క్లైమాక్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవుడంటే భక్తి, భయం లేని పరిస్థితి నేడు నెలకొంది. రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వదలడం లేదు. దేవుని ద్వారా రాజకీయాలు పొందే దారుణమైన క్లైమాక్స్లో మనం ఉన్నాం. దేవుని విగ్రహాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కన్పిస్తోంది' అని జగన్ అన్నారు.

పథకాల ప్రారంభం రోజే విగ్రహాల ధ్వంసం ఎందుకో...
రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న రోజుల్లోనే విగ్రహాల ధ్వంసాలు జరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం జరగకూడదనే విగ్రహ ధ్వంసాల కుట్రలు జరగుతున్నాయి. ప్రభుత్వం ఎప్పుడు మంచి పనులు చేస్తుందో అప్పుడే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 20 వేల ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. తప్పు ఎవరు చేసినా తప్పే. అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందే' అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రైవేటు ఆలయాలు, ప్రతిపక్ష నాయకుల ఆలయాల్లో ఘటనలు జరుగుతున్నాయన్నారు. రాజకీయపరంగా జరుగుతున్న గెరిల్లా యుద్ధాన్ని పోలీసులు అడ్డుకోవాలని ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications