లాలూకు పట్టినే గతే జగన్కు కూడా: యనమల
హైదరాబాద్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు పట్టిన గతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికీ పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. దాణా కుంభకోణంలో రూ.950కోట్ల అవినీతికి పాల్పడిన లాలూ ప్రసాద్ దోషిగా తేలినట్లే లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ జగన్ కూడా దోషిగా రుజువవుతుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం జగన్ ప్రజల సానుభూతి కోసం పాకులాడుతున్నాడని, 16 నెలలు జైల్లో ఉన్నానని చెప్పుకుంటున్న జగన్.. ఇలాంటి అవినీతి కేసులోనే 43నెలలుగా జైల్లో ఉంటున్న మధుకోడా గురించి ఏం చెబుతారని యనమల ప్రశ్నించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు సహకరిస్తానని జగన్ సోనియాకు మాట ఇచ్చి అసెంబ్లీ ఏర్పాటు ద్వారా అందుకు సహకరించాలని చూస్తున్నారని అన్నారు.

వేల కోట్ల అవినీతికి పాల్పడి 10 చార్జీషీట్లలో ఎ1 ముద్దాయిగా ఉన్న జగన్ నీతి వ్యాఖ్యలు వల్లించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తికి గవర్నర్ ఎలా అపాయింట్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మీద కేసులు పెట్టి అవి రుజువు కాకపోవడంతో అభాసుపాలైన విషయం వాస్తవం కాదా అని యనమల రామకృష్ణుడు అన్నారు.
సోనియాపై మాట్లాడకపోవడం విడ్డూరం: కృష్ణమూర్తి
రాష్ట్ర విభజనకు కారకురాలైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు. కాంగ్రెస్కు జగన్ తోక అని, జగన్కు కాంగ్రెస్ తోక అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి తమను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాపాడగలరని ప్రజలు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. బిజెపితో పొత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications