ఆ ఊసే ఎత్తని చంద్రబాబు- పవన్ సర్కార్: సభలో వైసీపీ ఫైర్: నిరసనగా..!!
AP Assembly Budget Sessions 2024: ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యాయి. అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి. పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టదలచుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.
ఇప్పుడు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపింది. మూడు నెలల కాలానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభకు సమర్పిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టనుంది.

ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర శాసన, మండలి సభ్యులు సభను వాకౌట్ చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తోన్న సమయంలో నిరసనలకు దిగారు. అధికార సంకీర్ణ కూటమికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
వైఎస్ఆర్సీపీ నిరసన ప్రదర్శనలు, నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని పేర్కొన్నారు. ఫలితంగా విభజిత ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రెవెన్యూ లోటు వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని చెప్పారు. అయినప్పటికీ- తన ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు.
2014-19 మధ్య రాష్ట్రం సమగ్రాభివృద్ధిని సాధించే దిశగా శరవేగంగా అడుగులు వేసిందని, భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగిందని గవర్నర్ చెప్పారు. పోలవరాన్ని 75 శాతానికి పైగా పూర్తి చేశామని అన్నారు. ఆ సమయంలో 2019లో ఎన్నికలు రావడం వల్ల అధికార మార్పిడి జరిగిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి.. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు, హత్యలు, అత్యాచారాలపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications