అన్నొస్తున్నాడని చెప్పండి.. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర: గొంతు చించుకున్న జగన్, హోదాపై..
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ వేదికగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 27వ తేదీ నుంచి తాను పాదయాత్ర చేస్తానని చెప్పారు.
పాదయాత్ర ప్రారంభంలో తిరుమల కొండ ఎక్కి, శ్రీవారిని దర్శించుకుంటానని, మొత్తం 3వేల కిలోమీటర్లు, ఆరు నెలల పాటు తిరుగుతానని చెప్పారు. దేవుడిని దర్శించుకొని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తానన్నారు. ప్రతి ఊరు, ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతం తిరుగుతానని తెలిపారు.
భువనేశ్వరికి దండం, ఆ బాధ ఎవరికీ చెప్పలేదు: షర్మిల, దిష్టితీసిన రోజా
అంతకుముందు, జగన్ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో సుదీర్ఘంగా వివరించారు. ఓ విధంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. అలాగే, చంద్రబాబు ఏం చేయలేదు, తాను ఏం చేస్తానో చెప్పారు. మొత్తం తొమ్మిది అంశాలు చెప్పారు.
అధికారంలోకి వస్తే.. క్లుప్తంగా..
1. వైయస్సార్ భరోసా: 5 ఎకరాలలోపు రైతులకు నెలకు రూ.50 వేల సాయం. ప్రతి ఏటా రూ.12 వేల 500 చొప్పున మే నెలలో అందజేయడం
2. వైయస్సార్ ఆసరా: డ్వాక్రా మహిళల కోసం.. డ్వాక్రా మహిళలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో, దాన్ని నాలుగు విడతలుగా చెల్లించడం. సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడం
3. పింఛన్లు: ప్రస్తుతం ఇస్తున్న రూ.1000కు బదులు రూ.2000
4. అమ్మ ఒడి : ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకు, ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1000. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్కరికి రూ.750 చొప్పున ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1500. ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున, ఇద్దరు పిల్లలకు రూ.2 వేలు నేరుగా తల్లులకే ఇస్తారు.
5. హౌసింగ్: ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు.జన్మభూమి వంటి కమిటీలతో పనిలేకుండా ఇళ్ల కేటాయింపు. దీని కింద 25 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు ఇవ్వడం
6. ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీకి బడ్జెట్ లో అవసరమైన నిధుల కేటాయింపు. ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఆపరేషన్ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థికసాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్
7. ఫీజ్ రీయంబర్స్ మెంట్ : ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్.ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు
8. జలయజ్ఞం
9. మూడు దశల్లో మద్య నిషేధం.
'ప్రతి ఊరు, వాడకు వెళ్లి చెప్పండి.. అన్నొస్తున్నాడు.. మంచి రోజులు ముందున్నాయని ధైర్యంగా చెప్పండి' అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు పాలనలో ఇదీ ఇబ్బంది..
వ్యవసాయం మీదనే అన్ని రంగాలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కరువు, అకాల వర్షాలు వస్తున్నాయన్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. రైతులకు పావలా వడ్డీ లేదు, సున్నా వడ్డీ ఏదీ లేదన్నారు. రైతులకు రుణాలు తగ్గించాలని చెప్పే సీఎం ఎవరైనా ఉన్నారా అంటే చంద్రబాబు అన్నారు. బ్యాంకుల నుంచి రైతులకు ఎక్కువ రుణాలు ఎలా ఇప్పించాలా అని సిఎం ఆరాటపడాలని, తక్కువ వడ్డీకి రుణాలు వచ్చేలా చేయాలని, కానీ చంద్రబాబు అలా చేయడం లేదన్నారు. చంద్రబాబు చేసే పనికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, అటు రైతులు నాశనమవుతున్నారన్నారు. బయట వడ్డీలకు రుణాలు తీసుకొస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సీఎం కోటయ్య కమిటీ పై సంతకం చేశారని, అది రైతులకు రుణాలు ఎలా తగ్గించాలా అని చెప్పే కమిటీ అన్నారు. చంద్రబాబు ఎడం చెత్తో మీ జేబులు కొడుతూ, కుడి చేత్తో ఇచ్చినట్లు ఫోజులు కొడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన మోసం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారన్నారు.
నేను ఏం చేస్తానంటే.. రూ.50వేలు ఇస్తా
నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తానంటే.. చిన్న, సన్నకారు రైతులకు, 5 ఎకరాలకు తక్కువగా ఉన్న రైతులకు రూ.50వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఏడాదికి రూ.12,500 ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తామని జగన్ చెప్పారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా 'వైయస్సార్ రైతు భరోసా' కింద దీనిని ఇస్తామని చెప్పారు. ఈ డబ్బుతో ఏం చేయాలనేది కూడా రైతు ఇష్టానికే వదిలేస్తామన్నారు. ఏ పంట వేయాలి అనేది కూడా ఆ రైతు ఇష్టమే అన్నారు. అర్హులందరిక ఇస్తామని, కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలు ఏదీ చూడమని చెప్పారు. 86 శాతం మంది సన్న, చిన్నకారు రైతులేనని, వారికందరికీ ఇది ఇస్తామని చెప్పారు. అప్పుడు అది రూ.33 వేల కోట్లు అవుతుందని, కానీ చంద్రబాబు ఇచ్చింది 11వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. జీరో వడ్డీకి, పావలా వడ్డీకి రుణాలు వచ్చేలా చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇస్తామన్నారు. రూ.2వేల కోట్లతో కరువు, వరదలు వచ్చినప్పుడు ఉపయోగించేలా కాలామిటీ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
Recommended Video
డ్వాక్రా మహిళలు
డ్వాక్రా, పొదుపు సంఘాలకు ఆసరా పథకం తీసుకు వస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు పొదుపు సంఘాల అక్కా చెల్లెళ్లకు టోపీ పెట్టాడన్నారు. చంద్రబాబు పుణ్యాన డ్వాక్రా మహిళలకు రుణాలు లేకుండా పోయాయన్నారు. దీనిని మేం మార్చేస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు 'వైయస్సార్ ఆసరా' పథకం తీసుకు వస్తామని, అక్కా చెల్లెళ్లను లక్షాదికారులను చేస్తామన్నారు.
పింఛన్
చంద్రబాబు చాలా విషయాలపై ధరలు పెంచుతారని, ఎందుకు అంటే ధరలు పెరిగాయని అంటారని, కానీ పింఛన్లు ఇవ్వడానికి మాత్రం ధరలు పెరగవా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్సుమెంట్సు కోసం మాత్రం పెరిగిన ధరలు గుర్తుకు రావా అన్నారు. కాబట్టి తాను వృద్ధులకు 'రూ.2వేలు' పింఛన్ ఇస్తానని చెప్పారు.
పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వస్తానని చెప్పారు. పిల్లల్ని బడికి పంపించాలని, వారికి నెలకు రూ.500 చొప్పున ఇస్తామని చెప్పారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలకు రూ.500 వందలు, 6వ తరగతి నుంచి 7వ తరగతి వరకు రూ.750 ఇస్తామని, ఇంటర్ పిల్లలకు నెలకు రూ.1000 ఇస్తామని జగన్ చెప్పారు. మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. చదువు కోసం భయపడొద్దని చెప్పాలన్నారు.
సిగ్గుండాలి చంద్రబాబుకు... గొంతు చించుకున్న జగన్
చంద్రబాబు ఇల్లు కట్టిస్తానని ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏమీ చేయలేదన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ కింద కేవలం 35వేలకు పైగా ఇల్లు మాత్రమే కట్టారని చెప్పారు. చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. అదే వైయస్ పాలనలో అయిదేళ్లలో అక్షరాలు కలిసున్న ఏపీలో 48 లక్షల ఇళ్లు కట్టించారన్నారు. సీమాంధ్రలో 24 లక్షల 18 వేలు అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందన్నారు. ఊరువాడ వెళ్లి, అన్నొస్తున్నాడు.. పరిస్థితులు మారుతాయని చెప్పండని జగన్ పిలుపునిచ్చారు. అక్షరాలా 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని, ప్రతి పేదవాడికి అండగా ఉంటామని వైసిపి కార్యకర్తలు గ్రామ గ్రామాన చెప్పాలన్నారు. ఇండ్లు జన్మభూమి కమిటీల్లా ఇవ్వమని, వైయస్లా ఇస్తామన్నారు. ఇండ్లు ఇవ్వడానికి మతం, కులం, రాజకీయం ఏదీ చూడమని జగన్ గొంతు చించుకొని మరీ చెప్పారు.
మనం వచ్చాక ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుందన్నారు. బాబు హయాంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యంగా తయారయిందన్నారు. కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధుగ్రస్తులకు ప్రత్యేక సాయం తీసుకు వస్తామన్నారు.
అన్నొస్తున్నాడని చెప్పండి..
బీసీలు అంటే తనకు ఎంతో ప్రేమ అని చంద్రబాబు చెబుతారని, కానీ వారిపై ప్రేమ చూపించింది వైయస్ మాత్రమే అని జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో ఫీజు రీయిమెంబర్సుమెంట్ సరిగా అమలు కావడం లేదన్నారు. రీయింబర్సుమెంట్స్ సరిపోవడం లేదంటే ఇల్లు, పొలాలు అమ్ముకుంటారులే అని చంద్రబాబు అంటారని జగన్ విమర్శించారు. కానీ మేం అధికారంలోకి వచ్చాక వైయస్ కలలు కన్నట్లుగా పేదవారికి చదువు చెప్పిస్తామన్నారు. అన్నొస్తున్నాడని ఇంటింటికి వెళ్లి చెప్పాలని జగన్ అన్నారు. మరో మాట కూడా చెప్పండి.. హాస్టల్లో ఉన్నందుకు రూ.20వేలు ఇస్తామని చెప్పండని తెలిపారు.
హోదా నాకు గుర్తుంది.. రాజీనామాలకు సై అని చెప్పా
ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవిని అన్నారని, ఇప్పుడు అదే వ్యక్తి నీరుగారుస్తున్నారని జగన్ అన్నారు. హోదా కోసం మనం ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాలు చేశామని చెప్పారు. ప్రత్యేక హోదా మరిచిపోలేని అంశమని జగన్ చెప్పారు. హోదా సాధించేందుకు లౌక్యంతోనే, దౌత్యంతోనే, పోరాటంతోనే సాధిస్తామని చెప్పారు. అవసరమైతే ఎంపీలతో రాజీనామా కూడా చేయిస్తానని చెప్పానని, ఆ విషయం నాకు గుర్తు ఉందని, హోదా సాధించే దిశగా ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
లంచాల ప్రాజెక్టు
రైతు బతకాలంటే నీళ్లు కావాలన్నారు. రైతుకు నీళ్లు రావాలంటే వైయస్ కలలు కన్న జలయజ్ఞం పూర్తి కావాలన్నారు. వైయస్ ఉన్నప్పుడు 80 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 20 శాతాన్ని మూడేళ్లలో కూడా చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు వాటిని లంచాల ప్రాజెక్టుగా మార్చారన్నారు. పోలవరాన్ని కేంద్రం కడతానంటే లంచాల కోసం చంద్రబాబు దిగజారి పోయారన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బంధువు కాంట్రాక్టర్గా ఉన్నారని, ట్రాన్సు కో టిడిపి నేతది అన్నారు. ఏ ప్రాజెక్టు చూసినా లంచాల కోసమే చంద్రబాబు ప్రాజెక్టులను పట్టుకున్నారని, రైతులకు నీళ్లు ఇచ్చేందుకు కాదన్నారు. ఈ పరిస్థితిని మేం మారుస్తామన్నారు.