జగన్ రూ.కోటి విరాళం, కేసీఆర్కు కేరళ సీఎం లేఖ: అరబ్ బిజినెస్ టైకూన్ల భారీ విరాళాలు
అమరావతి: భారీ వర్షాలు, వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ విరాళం ఇచ్చారు. తన తరఫున కేరళ వాసులకు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఈ కోటి రూపాయల విరాళాన్ని కేరళ సీఎం సహాయనిధికి వైసీపీ పంపించనుంది.
వరదలపై ఒమన్ కేరళవాసి దారుణమైన ట్వీట్, ఊడిన ఉద్యోగం
భారీ వరదలు, వర్షాలతో కేరళ ఛిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. కేరళ పరిస్థితిపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వరద విపత్తు హృదయాన్ని కలచివేస్తోందని ఇటీవల ట్వీట్ చేశారు. కష్టకాలంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెంట ఉంటాయని చెప్పారు.
కేసీఆర్కు కేరళ సీఎం థ్యాంక్స్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కేరళ సీఎం పినరాయి విజయన్ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25 కోట్ల విరాళం ఇవ్వడంపై విజయన్ హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో సహాయం అందించినందుకు థ్యాంక్స్ చెబుతూ లేఖ రాశారు.
వెల్లువెత్తుతున్న విరాళాలు
కేరళ వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీఎన్జీవోలు కూడా రూ.20 కోట్ల విరాళం ఇచ్చారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఐఏఎశ్ సంఘం ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించింది.
బిజినెస్ టైకూన్ల విరాళం
భారత సంతతి అరబ్ వ్యాపారులు దాదాపు రూ.13 కోట్ల మేర సహాయం ప్రకటించారు. దీంతో బాధితులను ఆదుకుంటామని, ఇందుకోసం పలు వ్యాపార సంస్థలు, ఇతర స్వచ్చంధ సంస్థలతో చెప్పిన యూఏఈ ప్రయత్నాలు ఫలించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారత సంతతి వ్యాపారాలు రూ.12.50 కోట్ల విరాళం ఇచ్చారు. కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్,మ ేనేజింగ్ డైరెక్టర్ రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఫాతిమా హెల్త్ కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ కూడా రూ.5 కోట్లు ఇచ్చారు. ఇందులో రూ.కోటిని సీఎం సహాయనిధికి పంపించనున్నారు. తమ వైద్య నిపుణుల్లో కొందరిని వాలంటీర్లుగా వరద బాధిత ప్రాంతాలకు పంపించామని తెలిపింది. యూఏఈ ఎక్స్చేంజ్, యునిమొని చైర్మన్, బిలియనీర్ బీఆర్ శెట్టి రూ.2 కోట్లు ఇచ్చారు. భారతీయ ఫిజీషియన్, దాత, అస్టర్ డీఎం హెల్త్ కేర్ వ్యవస్థాపక చైర్మన్ అఝద్ మూపెన్ రూ.50 లక్షలు ఇచ్చారు. ఖాతర్ చారిటీ రూ.34.89 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.
ఏపీ అధికారులు కేరళకు
వరద విలయంలో చిక్కుకున్న కేరళలో విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపిస్తోంది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (తిరుపతి) నుంచి 10మంది అధికారులు, 120 మంది సిబ్బంది సోమవారం కేరళకు బయలుదేరుతోంది. పునరుద్ధరణకు అవసరమైన పనిముట్లు, పరికరాలు వెంట తీసుకెళ్లనున్నారు. ఏపీ అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ దళాలు కేరళలో సహాయ చర్యలను ప్రారంభించాయి.
కేరళకు ఊరట
కేరళవాసులకు ఆదివారం వాతావరణ విభాగం కాస్త ఊరటను ఇచ్చే ప్రకటన చేసింది. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు ఉండబోవని తెలిపింది. గత మూడు రోజులుగా వర్షాల తీవ్రత తగ్గుముఖం పడుతోందని ఆ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. సోమవారానికి ఆకుపచ్చ రంగు హెచ్చరిక మాత్రమే జారీ చేస్తున్నామని అంటే పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశముందన్నారు.