జైలు కంటే బాధేస్తోంది, కోర్టుకెళ్తాం: టి నోట్పై జగన్ ఫైర్
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం చెప్పారు. కేబినెట్లో తెలంగాణ నోట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన నిర్ణయాన్ని ఆపేందుకు తాము అన్ని విధాలుగా పోరాడుతామని చెప్పారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రివర్గం నిర్ణయానికి నిరసనగా సీమాంధ్రలో శుక్రవారం నుంచి 72 గంటల బంద్కు జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన సమైక్యం కోసం అన్ని విధాలా పోరాడుతామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాల ద్వారా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఓట్లకోసం, సీట్లకోసం లెక్కలు వేసి రాష్ట్రాన్ని విడగొట్టారని, వీళ్లు అసలు మనుషులేనా? అని విమర్శించారు. తాను జైలుకు వెళ్లినప్పుడు అనుభవించిన బాధకంటే ఎక్కువగా ఈ రోజు బాధేస్తోందన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజని చెప్పి రాష్ట్ర విభజనపై చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారన్నారు.
ఇప్పుడు దాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కలిసిపోయారని, రాష్ట్రాన్ని అమ్మేశారని ధ్వజమెత్తారు. కేబినెట్ రాకముందే అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్ర తీర్మానం చేయించి కేంద్రానికి పంపించాలని మొన్న తాము గవర్నర్ను కలిసి విన్నవించామని, ముఖ్యమంత్రికి లేఖ రాశామని, చంద్రబాబును ఇదే విషయమై సహకరించాలని బతిమిలాడామని చెప్పారు.
ఒక్కరూ కూడా స్పందించ లేదన్నారు. గతంలోనే మా పార్టీ ఎంపీలం రాజీనామాలు చేశామని, వాటిని ఆమోదించాలని పలుమార్లు స్పీకర్కు లేఖలు రాశామని, ఇప్పుడు సీమాంధ్ర ఎంపీలు 25 మంది రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను మైనారిటీలో పడేయాలని సూచించారు. అప్పుడే ఈ ప్రక్రియ ఆగుతుందన్నారు. మంత్రులు కూడా రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications