మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన జగన్ ? ఆ సలహాతోనే - మళ్లీ ఎప్పుడంటే?
ఏపీలో మూడు రాజధానుల స్ధానంలో అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు పెట్టబోతోందని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వచ్చారు. కానీ ఐదు రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుందన నిర్ణయించిన బీఏసీ సమావేశంలో దీనిపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు కావస్తున్నా ఆ బిల్లు ఊసేలేదు. దీంతో బిల్లుపై వైసీపీ ఈసారికి వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు కీలక కారణాలు కనిపిస్తున్నాయి.
మూడు రాజధానుల బిల్లు
ఏపీలో గతంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కౌంటర్ గా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో అసెంబ్లీలో రాజధానులకు సంబంధించిన రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా మార్పులు చేర్పులతో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసింది.
అయితే చివరికి బిల్లు మాత్రం అసెంబ్లీ ముందుకు రాలేదు. అసెంబ్లీ ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ బిల్లు ప్రస్తావన లేకపోవడం, ఈ సమావేశాల్లోనే వికేంద్రీకరణపై మరోసారి చర్చ పెట్టి సరిపెట్టేయడం చూస్తుంటే ఈ సమావేశాల్లో బిల్లు తీసుకురావడం కష్టమేనని తేలిపోయింది.
బిల్లుపై వెనక్కి తగ్గినట్లే?
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు కచ్చితంగా ప్రవేశపెట్టి తీరుతామని మంత్రులు అమర్నాథ్, రోజా సమావేశాలకు ముందు చెప్పారు. దీంతో ఈసారి బిల్లు పెట్టడం ఖాయమని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. బిల్లుపై బీఏసీ సమావేశంలో చర్చ రాలేదు. అలాగే ఆ తర్వాత కూడా నేరుగా ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. కేవలం అసెంబ్లీలో మరోసారి ఇదే అంశంపై చర్చ పెట్టి సరిపెట్టింది. అంతే కాదు సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి వదిలేసింది. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
ఆయన సలహాతోనే?
గతంలో వైసీపీ ప్రభుత్వం తరఫున, సీఎం జగన్ తరఫున పలుకేసులు వాదించిన న్యాయనిపుణులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, సొలిసిటర్ జనరల్ ముకుల్ రోహత్గీ అసెంబ్లీలో బిల్లు విషయంలో ప్రభుత్వానికి కీలక సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బదులుగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసి తీర్పు వచ్చాక ఈ బిల్లు ప్రవేశపెట్టమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో ప్రభుత్వం కూడా ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టకుండా కేవలం మరోసారి చర్చకు పరిమితమైంది. అలాగే సుప్రీంకోర్టులో వాదించేందుకు వాదనలు సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు హైకోర్టులోనూ రాజధాని రైతుల పిటిషన్లు విచారణ దశలో ఉన్నందున ఈ వ్యవహారంలో దూకుడు మంచిది కాదనే సలహాను సర్కార్ పాటించినట్లు కనిపిస్తోంది.
కొత్త బిల్లు ఎప్పుడంటే?
తాజా పరిస్దితులని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంటుంది. దానిని లిస్ట్ చేసిన తర్వాత విచారణ ప్రారంభమై ఏయే మలుపులు తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. అదే సమయంలో రైతులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్ లోనూ ప్రతివాదులయ్యే అవకాశం ఉంది.
ఆ తర్వత హైకోర్టు తరహాలోనే సుప్రీంకోర్టులోనూ సుదీర్ఘ విచారణ తప్పేలా లేదు. రాజ్యాంగపరమైన పలు అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వాదన కూడా కీలకం కానుంది. అసలే బీజేపీ రాజధానులపై గతంలో తీసుకున్న స్టాండ్ మార్చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి తీర్పు వస్తే తప్ప కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే టీడీపీ కూడా ఈ వ్యవహారాన్ని వైసీపీ ఎన్నికల వరకూ లాగబోతోందని ప్రచారం చేస్తోంది.