ప్రత్యేక హోదాపై రేపటి నుంచే జగన్ నిరవధిక నిరశన దీక్ష
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రేపటి నుంచి (మంగళవారం నుంచి) నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుడుతన్నారు. గుంటూరు జిల్లాలోని నల్లపాడులో ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి నల్లపాడులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిరవధిక నిరాహార దీక్షను చేపట్టేందుకు ఆయన మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత దీక్షా శిబిరానికి బయలుదేరి వెళ్తారు.

సెప్టెంబర్ 26వ తేదీన నిరాహార దీక్ష చేపట్టాలని జగన్ తొలుత నిర్ణయించుకున్నారు. అయితే, ప్రభుత్వ అనుమతి నిరాకరణతో దీక్ష వాయిదా పడింది. రేపు మంగళవారం చేపట్టబోయే దీక్షకు జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పరిశీలించారు.
సోమవారంనాడు గుంటూరు పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉప్పులేటి కల్పన, తదితరులు హాజరయ్యారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు జగన్ దీక్ష కొనసాగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications