చంద్రబాబుపై జగన్ కొత్త మైండ్ గేమ్ స్టార్ట్ ! ఆయనిచ్చిన అస్త్రంతోనే ! మరింత మసాలా వేసి మరీ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వ తప్పిదాలపై నిత్యం విపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా ఆయనకు జనంలో ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడం లేదు. దీంతో తాజాగా రూటు మార్చారు. కొత్త విమర్శలతో జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సెంటిమెంట్ కార్డు కూడా ప్రయోగిస్తున్నారు. దీంతో జనం మూడ్ కాస్తయినా మారుతుందనేది ఆయన ఆలోచన కావచ్చు. కానీ ఈ ప్రయోగం కాస్తా వికటించి వైఎస్ జగన్ కు అస్త్రంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఓ ప్రభుత్వాధినేతకూ, విపక్ష నేతకూ ఉండే సహజమైన పోరుకు భిన్నంగా వ్యక్తిగత దాడులతో ఇద్దరూ రెచ్చిపోతున్నారు. అదే సమయంలో ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో తెలియకపోవడంతో వీరిద్దరూ ప్రత్యర్ధులపై రోజురోజుకూ దాడులు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్ధులపై కొత్త కొత్త అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇందులో ఏది సఫలమవుతుందో వారికీ తెలియడం లేదు. దీంతో ప్రతీ మైండ్ గేమ్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
చంద్రబాబుపై జగన్ మైండ్ గేమ్
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై పలుసార్లు మైండ్ గేమ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అదే మైండ్ గేమ్ ను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుపై జగన్ మైండ్ గేమ్స్ పలుమార్లు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు మరో మైండ్ గేమ్ తో జగన్ ముందుకొస్తున్నారు. దీన్ని జనంలోకి పంపేందుకు ఇవాళ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగిన బీసీ సభ ఇందుకు వేదికైంది.
చంద్రబాబుకు చివరి ఎన్నికలంటూ..
వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు కచ్చితంగా చివరి ఎన్నికలేనని వైఎస్ జగన్ తేల్చిచెప్పేశారు. ఇవాళ బీసీ సభలో మాట్లాడుతూ.. మనం మారీచులు, పెత్తం దార్లతో యుద్ధం చేయక తప్పదని, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు (పవన్ కళ్యాణ్) ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో చెప్పాలంటూ సవాల్ విసిరారు. వైసీపీ సామాజిక న్యాయానికి ప్రతినిధి అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇంతకు మించిన గెలుపు ఇవ్వండంటూ బీసీల్ని జగన్ కోరారు. దీంతో వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు చేసేందుకు బీసీలు కృషి చేయాలంటూ జగన్ కోరినట్లయింది.
చంద్రబాబు అస్త్రంతోనే జగన్ ?
తాజాగా కర్నూల్లో జరిగిన ఓ సభలో చంద్రబాబు ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చెప్పుకొచ్చారు. తనకు లాస్ట్ ఛాన్స్ ఇమ్మని ప్రజల్ని కోరారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన సభల్లోనూ ప్రజలు అప్రమత్తం కాకపోతే ఇవి తనకు మాత్రమే కాదు రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయన్నారు. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుకు ఓటేయకపోతే రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చివరి ఎన్నికల డైలాగ్ ను జగన్ కూడా వాడుకోవడం మొదలుపెట్టేసారు. అవును వచ్చేవి చంద్రబాబుకు చివరి ఎన్నికలేనని ఇవాళ తేల్చిచెప్పేశారు. తద్వారా ఈ వాదనను జనంలోకి మరింత బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.