ఏపీ రాజధాని: చంద్రబాబు ముహూర్తంపై జగన్ ఆగ్రహం
హైదరాబాద్: రాజధాని పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనకు ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడారు. ముహూర్తం అంటూ రాజధాని పైన తొందరపాటు ప్రకటన సరికాదన్నారు. అధికారముందని ఇష్టం వచ్చినట్లు ప్రకటన చేయవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
అంతకుముందు శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీడీపీ నాయకుడు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. సభలో ఆ పార్టీ తీరు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా ప్రతిపక్షం సహకరిచడంలేదని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు హిపోక్రసీని వీడి జగనోక్రసీ నుంచి బయటపడి డెమోక్రసీలోకి రావాలన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభాహక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించడం దారుణమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే సభ నడుస్తుందన్నారు.
జగన్ ఎస్టేట్లో నిర్వహించే కార్యక్రమాల్లాగా శాసససభ కార్యక్రమాలు జరగవని ఎద్దేవా చేశారు. జగన్ సభలో అల్లరి చిల్లరి పిల్లాడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాగే వ్యవహరిస్తే సభలో అడుగుపెట్టే అర్హత కోల్పోతారని హెచ్చరించారు. జగన్ అనుభవరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్నాడని, ఆయనకు సరైన సలహాలు ఇచ్చి దారిలోకి తీసుకురావాలనిన్నారు.