చినబాబును ఆడిపోసుకున్న జగన్: నారా లోకేష్ ప్లానేమిటి?
విజయవాడ: పార్టీ ఫిరాయింపులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చినబాబు నారా లోకేష్ను ఆడిపోసుకున్నారు. కడప జిల్లాలో ప్రజా ప్రతినిధులను చినబాబు ప్రలోభ పెడుతున్నారని ఆయన గురువారం ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాయలసీమ ఆపరేషన్ చేపట్టినట్లు కనిపిస్తున్నారు.
రాయలసీమ జిల్లాల్లోని కింది స్థాయి ప్రజా ప్రతినిధులను కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి కొల్లగొట్టాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
రెడ్లు, కొంత మేరకు దళితులు వైయస్సార్ కాంగ్రెసు వైపు ఉన్నారు. ఆ బలంతోనే వైయస్సార్ కాంగ్రెసు గత ఎన్నికల్లో రాయలసీమలో సీట్లు సంపాదించుకోగలిగిందనే అంచనా ఉంది. టిడిపికి ఉన్న కమ్మ సామాజిక వర్గం ట్యాగ్ను కూడా తొలగించాలనే ప్రణాళిక నారా లోకేష్ వద్ద ఉందని అంటున్నారు.
కాపు సామాజిక వర్గాన్ని గత ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతుతో టిడిపి తన వైపు లాక్కుంది. ఆ తర్వాత దాన్ని స్థిరపరుచుకోవడానికి ఆరుగురు కాపు శాసనసభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం శాసనసభ్యులను కూడా పార్టీలోకి తీసుకుని వారికి మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఇద్దరు మాత్రమే రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు మంత్రివర్గంలో ఉన్నారు. వారు కూడా గోపాలకృష్ణా రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి, పల్లే రఘునాథ రెడ్డి అనంతపురం జిల్లా నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్న కర్నూలు, కడప జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బ తీస్తూ రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగానే నారా లోకేష్ రాయలసీమలో పర్యటిస్తూ ఫిరాయింపులను ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.