దత్తాత్రేయ లేఖ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం, రోహిత్ని దేశద్రోహిగా చిత్రీకరించేందుకే: జగన్
హైదరాబాద్: హెచ్సియు విద్యార్థి రోహిత్ పైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి లేఖ రాయడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనని వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. అతనిని దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, రోహిత్ ఆత్మహత్య కారకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
వైయస్ జగన్ బుధవారం నాడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్య గురించి విద్యార్థులను అడిగి ఆరా తీశారు. నాలుగో రోజు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అతను సంఘీభావం తెలిపారు.
Photos: దత్తాత్రేయ ఇంటి ముట్టడి
వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన పైన ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని అన్నారు. రోహిత్ మంచి తెలివైన విద్యార్థి అన్నారు. రోహిత్ తల్లి చాలా కష్టపడి అతనిని చదివించారని చెప్పారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి రోహిత్ చదువుకుంటున్నాడని చెప్పారు. అతనిది చాలా పేద కుటుంబం అన్నారు.
ఎన్నో ఆశలతో రోహిత్ తల్లి రాధిక.. అతనిని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి పంపించిందని చెప్పారు. వర్సిటీలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఓ కేంద్రమంత్రి మరో కేంద్రమంత్రికి లేఖ రాశారని చెప్పారు. విశ్వవిద్యాలయంలోని ఘటన పైన కేంద్రమంత్రి లేఖ రాయడం పిచ్చుక పైన బ్రహ్మాస్త్రమే అన్నారు.
సదరు కేంద్రమంత్రి రాసిన లేఖను విశ్వవిద్యాలయానికి పంపించారని, ఆ తర్వాత దానిపై ఏం చర్యలు తీసుకున్నారని పలుమార్లు గుర్తు చేశారని జగన్ అన్నారు. ఇప్పుడు కూడా కేంద్రం ఈ విషయం నుంచి తప్పించుకునే ధోరణిలో ఉందని ఎద్దేవా చేశారు. మొత్తం ఘటనను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఈ నేల పైన మానవత్వం మంటకలిసిపోతోందా అని ప్రశ్నించారు. లేఖల మీద లేఖలు రాసి వీసీ పైన ఒత్తిడి పెంచడం ఎందుకని ప్రశ్నించారు. రోహిత్ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రోహిత్ కులాన్ని వివాదాస్పదం చేయడం సరికాదన్నారు.
రోహీత్ ఎస్సీ కాదని, బీసీ అని దుష్ప్రచారం చేస్తున్నారని, చనిపోయాక అలా ప్రచారం చేయడం ఎందుకన్నారు. రోహిత్ ఎస్సీ అని ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పారు. యూనివర్సిటీలలో కుల రాజకీయాలు ఎందుకన్నారు. అలాగే రాజకీయ జోక్యం ఉండవద్దన్నారు. క్యాంపస్లో అసమానతలు వద్దని చెప్పారు. రోహిత్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు.
హెచ్సియులో నాలుగోరోజూ బంద్
రోహిత్ మృతితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాలుగోరోజైన బుధవారం కూడా బంద్ కొనసాగుతోంది. సెంట్రల్ యూనివర్సిటీని అష్టదిగ్బంధం చేశామని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు బంద్ కొనసాగిస్తామని విద్యార్థి సంఘం నేత ఈశ్వర్ తెలిపారు. ఇవాళ పలువురు జాతీయ నేతలు సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించనున్నారు.