పార్టీ వేడుకలకు జగన్ దూరం: తెలంగాణలో ఒత్తిడి వల్లే!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపక వేడుకలకు ఆ పార్టీ అధ్యక్షలు వైయస్ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు. బుధవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మూడో వ్యవస్థాపక దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం వేదిక విషయంలో తర్జన భర్జన కొనసాగిందని సమాచారం. పార్టీ కార్యాలయంలో నిర్వహించాలా లేక లోటస్ పాండులో నిర్వహించాలా అనే విషయమై తొలుత తర్జన భర్జన పడ్డారట.
తొలుత పార్టీ కార్యాలయంలోనే నిర్వహించాలనుకున్నప్పటికీ జగన్ వచ్చే అవకాశం లేదని వెంటనే వేదికను లోటస్ పాండుకు మార్చారు. అప్పటికీ జనగ్ రాలేదు. దీంతో మళ్లీ పార్టీ కార్యాలయంలోనే వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారట. జగన్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
కాగా, రాష్ట్రంలోను మూడు ప్రాంతాల్లోను ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం మూడు బృందాలుగా ఏర్పడింది. జగన్, షర్మిల, విజయమ్మలు వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జగన్ సీమాంధ్రలో ప్రచారం చేయనున్నారని సమాచారం. సీమాంధ్రలో ఎలాంటి రాజకీయ ప్రతికూలతలు ఎదురు కాకుండా ఉండేందుకు ఆయన పదమూడుల జిల్లాల పైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉభయగోదావరి జిల్లాలో 17 వరకు కొనసాగుతుంది. 16న అనంతపురం జిల్లా కదిరి నుండి విజయమ్మ 17న ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా నుంచి షర్మిల ప్రచారం చేస్తారు. విజయమ్మ 16-23 వరకు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. 24న తెలంగాణలోని మహబూబ్ నగర్లో ప్రవేశిస్తారు.
షర్మిల 17 నుండి 22 వరకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రచారం చేస్తారు. 23న నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో మాత్రమే షర్మిల, విజయమ్మలు ప్రచారం చేయనున్నారని సమాచారం. కాగా, తెలంగాణలో షర్మిల లేదా విజయమ్మలు పోటీ చేసే అవకాశముంది. తెలంగాణ ప్రాంతంలో నేతలు, కార్యకర్తలు జగన్ పైన ఒత్తిడి చేయడంతో షర్మిల, విజయమ్మలను తెలంగాణలో ప్రచారం చేయించి, ఇక్కడి నుండి బరిలో దింపాలని జగన్ నిర్ణయించుకున్నారట.