పవన్ కళ్యాణ్పై జగన్ వ్యాఖ్యలు.. నిజమేనా?: నరేంద్ర మోడీపై 'మరోమాట'!
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అమరావతి: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆయన సీఎం చంద్రబాబు చెప్పినట్లు వినే స్థితిలో ఉన్నారని, అది మార్చుకోవాలని హితవు పలికారు.
ఏపీలో టిడిపి అధికారంలో ఉంది. ప్రజల్లో ప్రతిపక్ష నేతగా.. జగన్ కంటే పవన్ కనిపిస్తున్నారని టిడిపి ఓసారి చెప్పింది. ప్రతిపక్ష నేత జగన్. కానీ రాష్ట్రంలోని సమస్యలపై జగన్తో పాటు పవన్ కూడా బాగా లేవనెత్తుతున్నారు.
అది నిజమన్నట్లుగా జగన్.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించిన సందర్భాలు లేవు. ప్రారంభంలో పవన్కు సంబంధించిన ప్రశ్నలను దాటవేసే ప్రయత్నాలు చేసేవారు.
జనవరిలో విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిర్వహించాలనుకున్న హోదా ఉద్యమానికి పవన్, జగన్ మద్దతిచ్చారు. అప్పడు పవన్ వర్సెస్ జగన్గా కనిపించింది. హోదా విషయంలో జగన్కు ఉన్న చిత్తశుద్ధి పవన్కు లేదని గతంలో రోజా, ఇతర వైసిపి నేతలు ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే, ప్రత్యేక హోదా విషయంలో పవన్ వరుసగా సభలు నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో ఆపినట్లు చెప్పారు. ఇప్పుడు కేంద్రం ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే దిశలో అడగులు వేస్తోంది. కాబట్టి పవన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇది వేరే అంశం.

ప్రత్యేక హోదాపై కలిసేందుకు సిద్ధం..
ప్రత్యేక హోదా కోసం వైసిపితో పాటు ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని ఇటీవల ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా పవన్ చెప్పారు. తాజాగా, బుధవారం జగన్ కూడా స్పందించారు. అయితే, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

కూర్చోమంటే కూర్చోవడం...
ఏపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలపై ఓ విలేకరి అడిగారు. దానికి జగన్ స్పందిస్తూ.. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలకు పవన్ కళ్యాణే కాదు.. ఎవరు మాట్లాడినా ఆహ్వానిస్తామని, వారిని స్వాగతిస్తామని వైసిపి అధినేత చెప్పారు. కానీ ప్రస్తుతం పవన్ తీరు చూస్తుంటే చంద్రబాబు కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబడే స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ముందు పవన్ మారాలని చెప్పారు.

జగన్ వ్యాఖ్యలు నిజమేనా? కార్నర్ చేసేందుకని..
చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. ఆయన చెప్పినట్లు పవన్ నడుచుకుంటున్నారని వైసిపి తొలి నుంచి ఆరోపిస్తోంది. ప్రధానంగా జగన్ను కార్నర్ చేసేందుకే పవన్ను తెరపైకి తీసుకు వస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. రెండు రోజుల క్రితం కూడా పవన్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగిన నేత ఏపీకి కావాలని చెప్పారు. 2014లో టిడిపి - బిజెపి కూటమికి మద్దతు వెనుక.. ప్రత్యేక హోదా, బాబు వంటి నేత ఏపీకి కావాలనే. ఈ విషయాన్ని ఆయన సూటిగా చెప్పారు.

జగన్పై అనుమానాలు!
అదే సమయంలో, జగన్ అన్నింటి పైన రాజకీయం చేస్తున్నారని, హోదా విషయంలో పవన్ కళ్యాణ్లా టిడిపితో పాటు బీజేపీని ఎందుకు నిలదీయడం లేదనే వారు కూడా ఉన్నారు. హోదా విషయంలోను జగన్ చంద్రబాబునే విమర్శిస్తున్నారు. ఇక, పవన్ లేవనెత్తే సమస్యల్లో రాజకీయం లేదని, అలాగే ఆయనకు అధికార యావ లేదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబును ప్రశంసించే సందర్భాల్లో మెచ్చుకోవడం, నిలదీసే సమయంలో నిలదీస్తున్నారంటున్నారు.

మరోమాట..!
మంగళవారం నాటి మీడియా సమావేశంలో పవన్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి స్పందించారు. తాను ప్రజలకు అనుకూలమని చెబుతూనే.. ప్రధాని మోడీ మోసం చేసారని అనుకోవడం లేదన్నారు. దీంతో, కేంద్రం ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తే పవన్ మళ్లీ రూటు మార్చుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

ప్యాకేజీ... పవన్ ఏం చేస్తారు?
త్వరలో అన్ని రాష్ట్రాలకు హోదాను తీసేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీకి ప్రకటించిన హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. దీంతో హోదా ఇవ్వాలని, అలాగే ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్దత ఏది విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్.. మళ్లీ బీజేపీ వైపు అడుగులు వేయనున్నారా అనేది తేలాల్సి ఉంది. లేదా హోదా కోసమే ఉద్యమిస్తారా చూడాలి.












Click it and Unblock the Notifications