మీరు సూపర్ అన్నా- ఆ కీలక శాఖకు జగన్ అరుదైన ప్రశంస- ఎందుకంటే ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లలో అత్యధికంగా విమర్శలు ఎదుర్కొన్న శాఖల్లో గనుల శాఖ కూడా ఒకటి. అంతే కాదు అత్యధికంగా ప్రశంసలు పొందిన శాఖ కూడా గనుల శాఖే కావడం విశేషం. ఆ ప్రశంసలు రాష్ట్రస్ధాయిలోనే కాదు జాతీయ స్ధాయికీ విస్తరించాయి. దీంతో సీఎం జగన్ కూడా ఇప్పుడు మైనింగ్ అధికారుల్ని స్వయంగా పిలిపించుకుని అభినందించారు.
ఏపీలో గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు, గుర్తింపు లభించాయి. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ఖనిజ వికాస్ అవార్డు ప్రకటించింది.

ఇటీవల ఢిల్లీలో మైన్స్ అండ్ మినరల్స్పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి దీన్ని అందుకున్నారు.
కేంద్రం ప్రకటించిన ఖనిజ వికాస్ అవార్డు క్రింద కేంద్ర గనుల శాఖ రాష్ట్ర మైనింగ్ అధికారులకు రూ. 2.40 కోట్లు ప్రోత్సాహక చెక్ను అందజేసింది. దీంతో గనుల శాఖ అధికారులు దీన్ని సీఎం జగన్ చేతుల మీదుగా అందుకోవలాని భావించారు. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, డెరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి ..కేంద్రం ప్రకటించిన ఖనిజ వికాస్ అవార్డు, దాని కింద ఇచ్చిన ప్రోత్సాహక చెక్ ను చూపించారు. దీంతో గనులశాఖను నడిపిస్తున్న మంత్రితో పాటు ఇతర అధికారుల్ని జగన్ అబినందించారు.












Click it and Unblock the Notifications