మున్సిపల్ పదవులపై జగన్ సంచలనం ? డిప్యూటీ సీఎంల తరహాలో-తీవ్ర పోటీ వల్లే
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో సునామీ సృష్టించిన వైసీపీకి ఇప్పుడు పదవుల పందేరంలో నెలకొన్న తీవ్ర పోటీతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో బహుళ పదవుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో క్యాబినెట్ కూర్పు విషయంలో నెలకొన్న పోటీతో కీలక సామాజిక వర్గాలకు అవకాశాలు ఇచ్చేందుకు ఐదుగురు డిప్యూటీ సీఎంలను తెరపైకి తెచ్చిన జగన్ ఇప్పుడు పట్టణ స్ధానిక సంస్ధల్లోనూ అదే ఫార్ములాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలతో దీనిపై ప్రాధమికంగా చర్చించిన జగన్.. తప్పదనుకుంటే అదే బాటలో నడిచే అవకాశముంది.

మరో సంచలనానికి తెరదీస్తున్న జగన్
ఏపీలో ఏకపక్షంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోరులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల పదవుల ఎన్నికపై దృష్టిసారించింది. ఈ నెల 18న జరగాల్సిన ఈ ఎన్నికల కోసం అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్ధితి. మున్సిపల్ పోరులో వైసీపీ తరఫున వివిధ సామాజిక వర్గాల అభ్యర్ధులతో పాటు పార్టీలో బలం, బలగం ఉన్న నేతలు కూడా చాలా చోట్ల విజయం సాధించారు. ఇప్పుడు వీరంతా పదవుల కోసం అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో వీరి విషయంలో సంచలన నిర్ణయం తీసుకునేందుకు జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీలో రెండేళ్ల క్రితం నాటి పరిస్ధితి
రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ ఏకంగా రాష్ట్ర శానససభలోని 175 సీట్లలో 151 సొంతం చేసుకుంది.. వైసీపీ ఫ్యాన్ గాలికి విపక్షాలు పూర్తిగా చిత్తయ్యాయి. దీంతో కేబినెట్ కూర్పు విషయంలో అధినేత జగన్కు ఇబ్బందులు తప్పలేదు. చివరికి అన్నీ పరిశీలించిన తర్వాత జగన్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎక్కువ మందికి న్యాయం చేయాల్సిన పరిస్ధితు ఉండటంతో.. మంత్రులకు ఐదేళ్లకు బదులుగా రెండున్నరేళ్ల పదవీకాలం మాత్రం ఇవ్వాలని నిర్ణయించారు. రెండున్నరేళ్ల తర్వాత వీరి స్ధానాల్లో దాదాపుగా కొ్త్త మంత్రులకు అవకాశం ఇస్తామన్నారు. అదే సమయంలో తొలి కేబినెట్ కూర్పులో సామాజికవర్గాల వారీగా ఐదుగురు డిప్యూటీ సీఎంలకు చోటిచ్చి దేశంలోనే రికార్డు నెలకొల్పారు. కాపు, బీసీ, ఎస్సీ, ముస్లిం, ఎస్టీ ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎంలుగా నియమించారు. ఇప్పుడు మున్సిపాల్టీల్లోనూ అదే పని చేస్తే ఎలా ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నారు.

డిప్యూటీ సీఎంల తరహాలోనే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లు
కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నెలకొన్న పోటీతో మేయర్లు, ఛైర్మన్ల వరకూ వదిలేసి డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లను ఒకటి కంటే ఎక్కువ మందిని నియమిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని జగన్ పరిశీలించారు. ప్రాధమికంగా నేతలతో దీనిపై చర్చించిన జగన్.. తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉంది. ఇవాళ లేదా రేపు దీనిపై నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. ఒక వేళ జగన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే డిప్యూటీ సీఎంల తరహాలోనే రాష్ట్రంలో తొలిసారిగా బహుళ డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లు పదవులు చేపట్టే అవకాశం ఉంటుంది. ఇందుకోసం చట్టపరంగా, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అప్పుడు ప్రభుత్వం దృష్టిసారిస్తుంది.

జగన్కు అగ్నిపరీక్షలా పదవుల పందేరం
ఏపీలో డిప్యూటీ సీఎంల తరహాలో ఒకరి కంటే ఎక్కువ డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ పదవుల్లో నియామకాలు జరపాలన్న వైసీపీ ఆలోచన వెనుక పార్టీలో నెలకొన్న తీవ్ర పోటీయే కారణం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన దాదాపు ప్రతీ కార్పోరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలో వైసీపీ భారీ ఆధిక్యాల్ని అందుకుంది. ఒకటి రెండు చోట్ల మినహా విపక్షాలు వైసీపీ కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. దీంతో గెలిచిన వారిలో పదవుల కోసం పోటీ కూడా అదే స్దాయిలో నెలకొంది. నిన్న మొన్నటి వరకూ గెలుస్తామో లేదో అన్న భయాలతో ఉన్న వారు కూడా ఇప్పుడు ప్రజా తీర్పుతో గెలిచిన తర్వాత హడావిడిగా చివరి నిమిషంలో లాబీయింగ్కు తెర తీస్తున్నారు. దీంతో పదవుల పందేరం విషయంలో వైసీపీ సర్కారుకూ, సీఎం జగన్కూ ఇదో అగ్నిపరీక్షగా మారిపోతోంది.












Click it and Unblock the Notifications