వక్ఫ్ బిల్లుపై తేల్చేసిన జగన్-బీజేపీతో కయ్యానికి రెడీ..!
కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటైన వక్ఫ్ బోర్డులో మార్పులు చేయడంతో పాటు వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కులు తేల్చే లక్ష్యంతో ఎన్డీయే సర్కార్ లోక్ సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆదిలోనే చుక్కెదురైంది. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో చేసేది లేక జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. అయితే ఈ బిల్లును వ్యతిరేకించిన విపక్షాల్లో వైసీపీ కూడా ఉంది. ఇవాళ ముస్లిం పెద్దలతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ వక్ఫ్ బిల్లుపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.
ఇవాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముస్లిం నాయకులతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ వక్ఫ్ చట్టంతో పాటు ఇతర సమస్యలపైనా వారితో చర్చించారు. ముస్లిం మైనారిటీల సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టిందని వారికి జగన్ గుర్తుచేశారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని జగన్ తెలిపారు.

వైసీపీ తప్పకుండా ముస్లింల వెంట నడుస్తుందని, వక్ఫ్ బిల్లుపై వారు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారని జగన్ హామీ ఇచ్చారు. పార్లమెంటు సంయుక్త కమిటీలో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని జగన్ ముస్లిం నేతలకు తెలిపారు.
వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ తో భేటీలో ముస్లిం నాయకులు తెలిపారు. కొత్త వక్ఫ్ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్న వారు, ఆ బిల్లును వైసీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications